ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'కు టిక్కెట్ దొరకలేదని థియేటర్పై రాళ్ల దాడి
విజయవాడ: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా బుధవారం విడుదలైంది. అయితే, తమ అభిమాన హీరో ఎన్టీఆర్ సినిమాకు టిక్కెట్లు దొరకలేదని కొందరు ఓ థియేటర్ పైన రాళ్ల దాడికి పాల్పడ్డారు.
ఈ సంఘటన విజయవాడలో జరిగింది. బెజవాడలోని రాజ్, యువరాజ్ థియేటర్లలో నాన్నకు ప్రేమతో సినిమా విడుదలయింది. అయితే, తమ హీరో సినిమా టికెట్లు దొరకలేదన్న ఆగ్రహంతో యువరాజ్ థియేటర్పై గుర్తు తెలియని అభిమానులు రాళ్లు రువ్వారు.
నాన్నకు ప్రేమతో సినిమా ప్రపంచ వ్యాప్తంగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నారంటూ విజయవాడలో అభిమానులు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా తమకు టిక్కెట్లు దొరకటం లేదంటూ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ పైకి రాళ్లురువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో థియేటర్ అద్దాలు పగిలిపోయాయి. థియేటర్ల దాడి నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.