పవన్! అలా అనడం సరికాదు, వదిలిపెట్టేదిలేదు: నన్నపనేని, ‘బురదజల్లుకోవద్దు’
అమరావతి: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దళిత మహిళలపై దాడి చేసింది టీడీపీ నేతలే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. పెందుర్తి ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనడం సరికాదని అన్నారు.
దళిత మహిళపై దాడి: పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్, నిందితుల అరెస్ట్
మహిళపై దాడి చేసిన ఘటన తెలిసిన వెంటనే అక్కడి అధికారులతో తాను స్వయంగా మాట్లాడానని నన్నపనేని తెలిపారు. తన ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ తాను మీడియా ముందుకు వచ్చానని తెలిపారు.
ఉపేక్షించేది లేదు
మహిళలకు న్యాయం చేయడానికే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనకు ఈ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. నిందితులు ఎవ్వరైనా ఉపేక్షించేది లేదని, శిక్షించి తీరుతామని నన్నపనేని చెప్పారు. బాధితురాలికి న్యాయం చేస్తామని అన్నారు.
కలచివేసిందన్న పవన్
కాగా, దళిత మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను విశాఖకు వస్తే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరించారు.
జనసేన కార్యకర్తలను పంపుతా..
అసలు ఏం జరిగిందన్న వాస్తవాలను సేకరించేందుకు విశాఖపట్నంలోని జనసేన కార్యకర్తలను పంపుతానని ఆయన ట్వీట్ చేశారు. భాధితురాలిని వీరు కలిసి, జరిగిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళతారని చెప్పారు. బాధితురాలికి అండగా నిలవాలని కోరుతూ యూరప్, అమెరికా నుంచి వివిధ వర్గాలకు చెందిన ఎంతో మంది ఎన్నారై మహిళలు తనకు మెసేజ్ లు పంపుతున్నారని తెలిపారు.
బురదజల్లుకోవడాలు మానేయాలి..
కులం ఏదైనా కానీ, కారణం ఏదైనా కానీ ఓ మహిళపై దాడి చేయడం సమర్థించాల్సిన విషయం కాదని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ, బీజేపీ, వైసీపీలు ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం మానేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న దానిపై అసెంబ్లీలో చర్చించాలని సూచించారు.