వివాహేతర సంబంధంపై సుప్రీం కోర్టు తీర్పు...అభ్యంతరకరం:నన్నపనేని రాజకుమారి
అమరావతి:వివాహేతర సంబంధం తప్పుకాదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం అభ్యంతరకరమని ఏపీ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పు వల్ల మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె గర్భం వివాదంపై మహిళా కమిషన్కు ఎటువంటి ఫిర్యాదు రాలేదని నన్నపనేని రాజకుమారి తెలిపారు. ప్రకాశం జిల్లాలో బాలింతపై జరిగిన ఘటన బాధాకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు.పెళ్లి చేసుకునే వయసులో మార్పులు తేవాలని ఏపీ మహిళ కమిషన్ తరుపున కేంద్రానికి సిఫారసు చేస్తామని ఆమె చెప్పారు.
అంతకుముందు గుంటూరులోని తన కార్యాలయంలో ఆమె 71వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వివాహేతర సంబంధాల తీర్పుపై సుప్రీం కోర్టు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. వివాహేతర సంబంధాలపై కొద్ది రోజుల కిందట సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆమె చెప్పారు.
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో మగాళ్లు మృగాళ్లుగా మారే ప్రమాదం పొంచి ఉందని ఆమె హెచ్చరించారు. ఎవరికైనా అన్యాయం జరిగితే సుప్రీంకోర్టులోనైనా న్యాయం జరుగుతుందనే ఆశ ఉండేదని, పదవీ విరమణ చేసే ముందు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులు, వాటి పర్యావసానంగా సమాజంలో చోటుచేసుకుంటున్న ఘటనలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా రామాయణంలోని ఒక కథను ప్రస్తావించిన నన్నపనేని రాజకుమారి స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు వ్యభిచారాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని స్పష్టం చేశారు. విజయవాడలో ఈ మధ్య చోటుచేసుకున్న అద్దె గర్భాల కేసులో అన్యాయానికి గురైన యువతికి అండగా ఉంటామని, యువతిని మోసం చేసిన డాక్టర్స్పై చర్యలు తీసుకుంటానని చెప్పారు.