వైసీపీ కనికరించలేదా..? చివరి వరకు ప్రయత్నించి.. రాజీనామా చేసిన రాజకుమారి..!!
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక గతంలో టీడీపీ నుండి నామినేటెడ్ పదవులు పొందిన నేతలు వరుసగా రాజీనామాలు చేశారు . కానీ ఇప్పటి వరకు ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపునేని రాజకుమారి ఎందుకు రాజీనామా చెయ్యలేదు ? ఇప్పుడు ఆమె రాజీనామా చెయ్యటానికి గల కారణాలు ఏంటి ? అంటే ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. నన్నపునేని కూతురు, అల్లుడు వైసీపీ ఉన్నారు. వారు ప్రయత్నం చేసినా ఆమె అనుకున్నది జరగలేదు. దీంతో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి రాజీనామా చెయ్యాల్సి వచ్చింది .నన్నపునేని రాజకుమారి గవర్నర్ హరిచందన్కు నేడు తన రాజీనామా లేఖను సమర్పించింది .
ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ మూడేళ్ల రిపోర్ట్ను గవర్నర్కు అందజేశానన్నారు. మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా తన హయాంలో ఎందరో బాధిత మహిళలకు అండగా నిలిచానని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా తాను తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించానని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో ఫైర్ బ్రాండ్ గా వెలుగువెలిగి మాటల తూటాలు పేల్చిన ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఇటీవల కూడా షాకింగ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. మేనరికపు వివాహాలు చేసుకోరాదు అని ఆమె వ్యాఖ్యానించారు . కానీ పార్టీకి సంబంధించి జరుగుతున్న మాటల దాడులపై ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం గమనార్హం.
ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతున్న సమయంలో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కూడా జగన్ ను కలిసేందుకు వెళ్లారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసేందుకు వెళ్ళిన ఆమె అక్కడికి వెళ్లే సరికే జగన్ తన నివాసానికి వెళ్లిపోయారు.జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో ఆయనకు అభినందనలు తెలియజేసేందుకు నన్నపునేని రాజకుమారి వెళ్ళారు కానీ జగన్ ని కలవకుండానే నన్నపనేని వెనుదిరిగారు. నన్నపనేని రాజకుమారి కూతురు, అల్లుడు వైసీపీలో ఉన్నారు. ఆమె రాజీనామా చెయ్యకుండా ఆమెనే మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా కొనసాగేందుకు చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కూతురు, అల్లుడు వైసీపీలోనే ఉన్నా ఆమె అనుకున్నది మాత్రం జరగలేదు . చివరకు రాజీనామా చేశారు నన్నపునేని. తాజాగా ఆమె రాజీనామా చేస్తున్న నేపధ్యంలో ఆ స్థానంలో వైసీపీ ఎవరికి అవకాశం ఇస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.