మహిళా ఎస్సై పై అనుచిత వ్యాఖ్యలపై నన్నపునేని స్పందన ... నిరూపిస్తే సూసైడ్ చేసుకోటానికైనా సిద్ధం !!
చలో ఆత్మకూరు' ను అడ్డుకునే క్రమంలో భాగంగా టీడీపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులపై చాలా దురుసుగా ప్రవర్తించారు టీడీపీ నాయకులు .పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన టిడిపి నేతలు పోలీసులపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. ఇక సాటి మహిళ అని కూడా చూడకుండా టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఓ మహిళా ఎస్సై మనస్థాపం చెందేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆమె విధుల నుంచి వెళ్ళిపోయిందని తెలుస్తుంది .
చంద్రబాబు నివాసం వద్ద టిడిపి నేతలు పోలీసుల తీరుపై వాగ్వాదానికి దిగిన సందర్భంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులతో వాగ్వాదానికి దిగిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నన్నపనేని రాజకుమారి 'దళితుల వల్లనే దరిద్రం' అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్ఐ అనురాధపై నోరు జారి మాట్లాడారని సమాచారం . నన్నపనేని వ్యాఖ్యలతో మనస్థాపానికి గురైన మహిళా ఎస్సై అనురాధ విధుల నుండి వెళ్లిపోయారని, తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారని తెలిపారు.
కానీ తాను ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు చెయ్యలేదని ,ఆ ఆరోపణలు కరెక్టు కాదని స్పష్టం చేశారు నన్నపునేని రాజకుమారి . మహిళా ఎస్సైని అవమానకరంగా మాట్లాడినట్టు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకునేందుకు తాను సిద్ధమని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం తనను కావాలని వేధిస్తుందని ఆమె పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు.వైసీపీ సర్కార్ తనను మానసిక వేధింపులకు గురి చేసి మహిళా కమిషన్ చైర్మన్ పదవికి బలవంతంగా రాజీనామా చేయించిందని ఆరోపించారు. రాజీనామా చేసినా ప్రభుత్వం తనను వదలడం లేదని నన్నపునేని రాజకుమారి విమర్శలు గుప్పించారు.