వైఎస్ జగన్ ను కలిసేందుకు వెళ్ళిన నన్నపునేని .. కలవకుండానే వెనుదిరిగిన మహిళా కమీషన్ చైర్ పర్సన్
Recommended Video
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 151 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. అటు లోక్సభ ఎన్నికల్లోనూ వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యంలో కొనసాగిన వైసీపీ చివర వరకు అదే పంథా కొనసాగించింది. వైసీపీ 22 చోట్ల గెలవగా.. టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఏపీలో అధికారం వైసీపీ హస్తగతమయ్యింది.
దీంతో వైసీపీ అధినేత జగన్ ని కలిసేందుకు అధికారులు, నామినేటెడ్ పదవులు నిర్వహిస్తున్న టీడీపీ నేతలు వెళ్తున్నారు. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కూడా జగన్ ను కలిసేందుకు వెళ్లారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసేందుకు ఆమె వెళ్లారు. అయితే, ఆమె అక్కడికి వెళ్లే సరికే జగన్ తన నివాసానికి వెళ్లిపోయారు.జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో ఆయనకు అభినందనలు తెలియజేసేందుకు నన్నపునేని రాజకుమారి వచ్చినట్లు తెలుస్తోంది
దీంతో, జగన్ ని కలవకుండానే నన్నపనేని వెనుదిరిగారు. అయితే నన్నపనేని రాజకుమారి కూతురు, అల్లుడు వైసీపీలో ఉన్నారు. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా ఆయన్ని కలిసేందుకే నన్నపనేని అక్కడకి వెళ్లినట్టు తెలుస్తోంది. రేపు ఇడుపులపాయకు జగన్ వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి వచ్చిన తర్వాత జగన్ ని ఆమె కలవనున్నట్టు సమాచారం.