నన్నయ్య వర్శిటీ ప్రొఫెసర్ శాడిజం: విద్యార్థినులపై లైంగిక వేధింపులు: విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిష్ఠాత్మక ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ దారుణ చర్యలకు పాల్పడ్డారు. స్పెషల్ క్లాసులు ఉన్నాయంటూ విద్యార్థినులను తన ఫ్లాట్కు రప్పించుకుని లైంగిక వేధింపులకు దిగాడు. చాలా కాలంగా అతని ఆకృత్యాలు కొనసాగుతూ వస్తున్నప్పటికీ.. తమ భవిష్యత్తను దృష్టిలో ఉంచుకుని విద్యార్థినులు నోరు విప్పలేదు. ఫలితంగా అతని ఆగడాలు మరింత పెరిగిపోయాయి. రోజురోజుకూ అతని వికృత చర్యలు పెరిగిపోవడంతో వాటిని భరించలేక విద్యార్థినులు తమ మౌనాన్ని వీడారు.
బట్టలు చించేశారు.. నోటితో చెప్పరాకుండా తిట్టారు.. బీజేపీ మహిళానేతపై లైంగిక దాడి
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయనకు లేఖ రాశారు. దీనిపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ఆ కిరాతక ప్రొఫెసర్ పేరు డాక్టర్ నిమ్మగడ్డ సూర్య రాఘవేంద్ర. పీహెచ్డీ చేశాడు. ఉన్నత విద్యావంతుడు. యూనివర్శిటీలో ఇంగ్లీష్ డిపార్టమెంట్ హెడ్ గా పనిచేస్తున్నాడు. చాలాకాలంగా రాజమహేంద్రవరంలో నివసిస్తున్నాడు. ఇంగ్లీష్ మాధ్యమంలో ఎంఏ చేస్తోన్న విద్యార్థినులను తరచూ స్పెషల్ క్లాసుల పేరుతో తన ఫ్లాట్ కు పిలిపించుకునే వాడని, అక్కడికి వెళ్లిన తరువాత లైంగిక వేధింపులకు పాల్పడే వాడని విద్యార్థినులు వెల్లడించారు.
తమ సెల్ ఫోన్లకు వాట్సప్ ద్వారా అసభ్య సందేశాలను పంపించే వాడని వాపోయారు. మార్కులను ఎరగా వేసి తమను లోబరచుకోవడానికి ప్రయత్నించే వాడని తెలిపారు. తన అఘాయిత్యాలకు వైస్ చాన్సలర్ పేరును కూడా వాడుకుంటున్నాడని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాము సూర్య రాఘవేంద్ర దారుణాలను వైస్ చాన్సలర్ కు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఫలితం లేదని పేర్కొన్నారు. విద్యార్థినులు రాసిన ఈ లేఖపై ముఖ్యమంత్రి స్పందించారు. విచారణకు ఆదేశించారు. పూర్తి నివేదికను అందజేయాలని ఉన్నత విద్య మంత్రిత్వశాఖకు సూచించారు. విచారణ బాధ్యతలను రిజిస్ట్రార్ కు అప్పగించారు.