‘‘నారా హమారా.. టీడీపీ హమారా’’...ఈ నెల 28న గుంటూరులో మైనారిటీల సభ
అమరావతి:''నారా హమారా.. టీడీపీ హమారా'' నినాదంతో ఈ నెల 28న గుంటూరులో నిర్వహించే సభకు మైనారిటీలు ఉత్సాహంగా తరలివచ్చేలా పార్టీ నేతలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం నిర్వహణ విషయమై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ నాయకులు, పార్టీ ముఖ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మైనారిటీల కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషి వల్ల వారి జీవన ప్రమాణాల్లో ఎంతో మార్పు తెచ్చి, అభివృద్ధి పథాన నడుస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చెప్పారు.
మైనారిటీల సంక్షేమానికి తాను చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మైనారిటీ నాయకులు, పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. మైనారిటీల అభ్యున్నతికి టిడిపి ప్రభుత్వం నాలుగేళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు రూ.200 కోట్లు ఉన్న మైనారిటీ బడ్జెట్ను ప్రస్తుతం తమ ప్రభుత్వం రూ.1000 కోట్లకు పైగా పెంచిందన్నారు.
అలాగే దుల్హన్ పథకం, రంజాన్ తోఫా తదితర పథకాలతో మైనారిటీలకు టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందనే ధైర్యం నింపగలిగామని చంద్రబాబు వివరించారు. విజయవాడ, కడపల్లో హజ్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి వుందని చంద్రబాబు వివరించారు. పేద ముస్లిం విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రతి ఏటా రాష్ట్ర బడ్జెట్లో పెద్ద మొత్తాన్ని స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తమ ప్రభుత్వం కేటాయిస్తోందని చంద్రబాబు తెలిపారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇమాంలకు రూ.5 వేలు, మౌజన్లకు రూ.3 వేలు గౌరవవేతనం ఇస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. 2019లో హజ్ యాత్రకు గన్నవరం విమానాశ్రయం నుంచే విమానాలు బయలుదేరతాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.