పవన్ను ఫాలో అవుతున్న లోకేష్- అంతర్వేది రథంపై తనదీ అదే మాట....
టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని ఏదైనా డిమాండ్ చేస్తే పట్టించుకోరనే అంచనాకు వచ్చేసినట్లే కనిపిస్తోంది. ముందుగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని బీజేపీ కానీ జనసేన కానీ చెప్పే వరకూ ఆగి, ఆ తర్వాత టీడీపీ నేతలు డిమాండ్ చేయడం తాజాగా కనిపిస్తున్న ట్రెండ్గా చెప్పవచ్చు. అంతర్వేది రథం దగ్ధం విషయంలోనూ ముందుగా బీజేపీ, జనసేన నేతలు సీబీఐ విచారణ కోరిన తర్వాతే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వం ముందు ఇదే డిమాండ్ పెట్టారు. ఇప్పుడు కొత్త రథం నిర్మాణం విషయంలోనూ అదే ట్రెండ్ కనిపిస్తోంది.
అంతర్వేదిలో దుండగుల చేతిలో దగ్ధమైన లక్ష్మీ నరసింహస్వామి రథం నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో జరిగే స్వామివారి కళ్యాణోత్సవం లోగా ఎట్టిపరిస్ధితుల్లోనూ రథం సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఇందుకు తగినట్లుగానే ఇతర రాష్ట్రాల వారి సాయంతో రథం నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజాగా ఇదే అంశంపై స్పందించిన జనసేనాని అంతర్వేది రథం తయారీ దగ్గరి నుంచి అన్ని విషయాల్లోనూ అగ్నికుల క్షత్రియులకు స్ధానం ఉందని, ఇప్పుడు కొత్త రథం విషయంలోనూ వారిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదు. సరిగ్గా ఇదే డిమాండ్ను ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ తెరపైకి తెచ్చారు.
అంతర్వేది రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సర్కారును లోకేష్ కోరారు. టెండర్లు పిలవకుండా రథ నిర్మాణం ప్రారంభించి అంతర్వేదిలో అగ్నికుల క్షత్రియుల మనోభావాలు దెబ్బతిస్తున్నారని లోకేష్ ఆరోపిచారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించడం మాని నూతన రధ నిర్మాణం కోసం తక్షణమే అధికారులు టెండర్లు ఆహ్వానించాలని లోకేష్ డిమాండ్ చేశారు. పవన్ బాటలోనే లోకేష్ కూడా అగ్నికుల క్షత్రియులకు రథం నిర్మాణంలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.