హవ్వా.. అశోక గజపతిరాజుపై అవినీతి ముద్రనా..? సీఎం జగన్పై నారా లోకేశ్ నిప్పులు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. అశోక గజపతిరాజు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం చేస్తోన్న రచ్చపై మండిపడ్డారు. శనివారం ట్వీట్టర్ వేదికగా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అశోక గజపతి రాజు గారి లాంటి గొప్ప వ్యక్తిపై అవినీతి ముద్ర వేయాలనుకోవడం సరికాదన్నారు. ఇది సూర్యుడిపై ఉమ్మి వేయడం లాంటిదేనని మండిపడ్డారు.
అశోక గజపతిరాజుని ఏకవచనంతో సంభోదిస్తూ మాట్లాడటం జగన్ ప్రభుత్వంలోని మంత్రి అధికార మదానికి నిదర్శనం అని మండిపడ్డారు. వేల ఎకరాల భూమి, సంపదను.. మన్సాస్ ట్రస్ట్కు ఇచ్చిన గొప్ప మనిషి అశోక గజపతిరాజు అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రంలో వేల మంది విద్యార్థులకు ఉచితంగా విద్యాబుద్దులు అందిస్తూ ప్రయోజకులను చేస్తున్న ఆయనపై అవినీతి ముద్ర వేయడం మంచి పద్ధతి కాదన్నారు.
మాన్సాన్కు సంబంధించి చీకట్లో జీవో ఇచ్చి రాజకీయ క్రీడ మొదలుపెట్టారని లోకేశ్ ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ప్రారంభమైన వైసీపీ విధ్వంసకాండ సింహాచలం అప్పన్న చూస్తున్నారు అని లోకేశ్ ఫైరయ్యారు. జగన్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని పేర్కొన్నారు.