జగన్ దెబ్బకు గ్యాలరీలో పడ్డ చంద్రబాబు: వైఎస్ భిక్ష వల్లే లోకేష్ మంత్రి అయ్యాడు?: చెలరేగిన కొడాలి
Recommended Video
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ, మాజీమంత్రి నారా లోకేష్పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెలరేగిపోయారు. తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఙతలు చెబుతూ.. చంద్రబాబు, నారా లోకేష్కు చురకలు అంటించారు. తన కేరీర్లో చూడను అనుకున్న కొన్ని అంశాలను చూశానని చెప్పుకొచ్చారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు గ్యాలరీలో..
40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు.. తమ నాయకుడి దెబ్బకు శాసన మండలి గ్యాలరీ ఎక్కారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ కొనసాగుతున్నప్పటికీ.. డుమ్మా కొట్టి మరీ.. నాలుగు గంటల పాటు శాసన మండలి గ్యాలరీలో కూర్చున్నారని అన్నారు. అత్యవసరమైతే తప్ప ఏనాడూ శాసన మండలి ముఖం కూడా చూడని చంద్రబాబుతో నాలుగు గంటల పాటు అక్కడ కూర్చోబెట్టిన ఘనత జగన్కు దక్కిందని అన్నారు.
వైఎస్ పెట్టిన భిక్ష కాదా?
చంద్రబాబును ఈ సారి అసెంబ్లీ గ్యాలరీ ఎక్కించాలని తాను వైఎస్ జగన్ను కోరుతున్నానని కొడాలి నాని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసన మండలిని పునరుద్ధరించారని, ఆయన దయవల్లే నారా లోకేష్ ఎమ్మెల్సీ కాగలిగారని అన్నారు. లేకపోతే పాపం.. నారా లోకేష్ ఏమైపోయేవాడోనని చెప్పారు. వైఎస్ పునరుద్ధరించిన శాసన మండలే లేకపోయి ఉంటే నారా లోకేష్ అనే వాడు ఏనాడైనా ఎమ్మెల్సీ అయ్యేవాడా? మంత్రి అయ్యేవాడా? అని కొడాలి నాని ప్రశ్నించారు.
పనికిమాలిన వారంతా మండలిలో..
పెద్దల సభ ద్వారా విలువైన సూచనలు, సలహాలను తీసుకోవడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో మండలిని పునరుద్ధరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాం ముగిసిన తరువాత.. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి పనికి మాలిన వారినందరినీ శాసన మండలి సభ్యులను చేసిందని కొడాలి నాని మండిపడ్డారు. దాని ఫలితమే- ఓ అత్యుత్తమమైన ఏపీ వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.