ఛాన్స్ నాకే: బ్రాహ్మణితో కలిసి నారా లోకేష్ యాత్ర
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ కృష్ణా జిల్లా నిమ్మకూరు నుంచి యువ ప్రభంజనం యాత్రను ప్రారంభించారు. నిమ్మకూరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు స్వస్థలం. హీరో నందమూరి బాలకృష్ణ కూతురు, సతీమణి బ్రాహ్మణితో కలిసి ఆయన శనివారంనాడు ఎన్టీ రామారావు దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నారా లోకేష్ తల్లి, చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి కూడా ఇక్కడికి వచ్చారు. స్థానిక ప్రజలను ఉద్దేశించి నారా లోకేష్ ప్రసంగించారు. నందమూరి తారకరామారావు స్వస్థలం నుంచి యాత్ర ప్రారంభించే అవకాశం తనకు మాత్రమే వచ్చిందని, ఇతరులెవరికీ రాలేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో గెలిపించే బాధ్యత మనందరిదీ అని ఆయన అన్నారు.
సీమాంధ్రను నవ్యాంధ్రప్రదేశ్గా, తెలంగాణను సామాజిక తెలంగాణకు నిర్మించాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధిని సాధించడమే తెలుగుదేశం లక్ష్యమని, అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు.
కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసు (వైయస్సార్ కాంగ్రెసు)లను భారీ మెజారిటీతో ఓడించే బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. నందమూరి తారకరామారావును అతి తక్కువ సమయంలో గెలిపించారని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన అన్నారు. ప్రసంగం చివరలో జై తెలుగుదేశం, జైజై తెలుగుదేశం అనే నివాదం ఇచ్చారు.