నారా లోకేష్.. బర్త్డే గిఫ్ట్: ఫుల్ జోష్లో టీడీపీ: అమరావతిలో సంబరాలు..ఘనస్వాగతం
అమరావతి: ఏపీ వికేంద్రీకరణ బిల్లును శాసన మండలి ఆమోదించకపోవడం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడం పట్ల కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తెలుగుదేశం నాయలకు సంబరాలు చేసుకుంటున్నారు. విజయోత్సవ ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లను శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపించిన మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ జన్మదినం కావడంతో వారి ఉత్సాహం, జోష్ రెట్టింపైంది.
మొన్న రూల్ 71, నిన్న రూల్ 154: నిబంధనలే అస్త్రాలుగా.. వైసీపీని దెబ్బకొట్టిన టీడీపీ..
టీవీలకు అతుక్కుపోయి..
ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలిలో వాడివేడిగా కొనసాగిన చర్చలను అమరావతి ప్రాంతవాసులు, రైతులు ఉత్కంఠతతో వీక్షించారు. ఉదయం సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచీ రాత్రి దాకా టీవీలకు అతుక్కుపోయి కనిపించారు. తమ జీవితాలు, రాజకీయ భవిష్యత్తుకు ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల రాజధాని గ్రామాల రైతులు, టీడీపీ నాయకులు మండలి సమావేశాలపై భారీగా అంచనాలను పెట్టుకున్నారు.
అసెంబ్లీ తరహాలో కాకూడదంటూ..
అసెంబ్లీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది సభ్యులతో తిరుగులేని మెజారిటీ ఉండటం వల్ల అలవోకగా ఈ బిల్లు అక్కడ ఆమోదం పొందింది. శాసన మండలిలో దీనికి భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్సీపీకి తొమ్మిది మంది సభ్యులే ఉన్నారు. మెజారిటీ అంతా టీడీపీ వైపే ఉండటంతో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకపోవచ్చనే సమాచారం ఉన్నప్పటికి కూడా అమరావతి ప్రాంతవాసులు, రైతులు ఉత్కంఠ క్షణాలను అనుభవించారు.
సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించిన వెంటనే..
వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ ప్రకటించిన వెంటనే.. అమరావతి గ్రామాల రైతులు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. బైక్లపై తిరుగుతూ సందడి చేశారు. టీడీపీ శ్రేణులు పరస్పరం అభినందించుకున్నారు. తెలుగుదేశం పార్టీ జిందాబాద్, చంద్రబాబు నాయుడి నాయకత్వం వర్ధిలాల్లి అంటూ నినాదాలు చేశారు. నారా లోకేష్ బర్త్డే సందర్భంగా లభించిన బహుమానమని అభివర్ణించారు.
చంద్రబాబు, నారా లోకేష్లకు ఘనస్వాగతం
శాసన మండలి వాయిదా పడిన అనంతరం ఉండవల్లికి బయలుదేరిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. మందడంలో టీడీపీ నాయకులు రోడ్లపై నిల్చుని, చంద్రబాబు, నారా లోకేష్లను స్వాగతించారు. వారిపై పూల వర్షాన్ని కురిపించారు. నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయంగా అభివర్ణించారు.