లోకేష్ 'బ్లండర్ మిస్టెక్': ఎంత మాటనేశారు?, జనమంతా షాక్..
ప్రసంగాన్ని మొదలుపెట్టే ముందు 'అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు' అన్నారు. జరిగేదేమో జయంతి ఆయనేమో దాన్ని వర్థంతిగా మార్చేయడంతో పక్కనున్నవాళ్లు వెంటనే ఆయన్ను అప్రమత్తం చేశారు.
విజయవాడ: మంత్రిగా ప్రమాణస్వీకారం రోజునే తన తెలుగు ప్రావీణ్యం ఏపాటిదో బయటపెట్టుకున్నారని ఏపీ పంచాయితీ శాఖ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో సెటైర్లు పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన నాలుక్కరుచుకున్నారు. ఏమరపాటు తనమో లేక అయోమయానికి లోనయ్యారో తెలియదు గానీ జయంతిని కాస్త వర్థంతిని చేసేశారు లోకేష్.
బాబా సాహెబ్ అంబేడ్కర్ 126వ జయంతి ఉత్సవాల సందర్బంగా మంత్రి నారా లోకేష్ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాట్లాడారు. ప్రసంగాన్ని మొదలుపెట్టే ముందు 'అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు' అన్నారు.
జరిగేదేమో జయంతి ఆయనేమో దాన్ని వర్థంతిగా మార్చేయడంతో పక్కనున్నవాళ్లు వెంటనే ఆయన్ను అప్రమత్తం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోవడంతో.. అక్కడికి వచ్చిన జనం లోకేష్ మాటలకు షాక్ తిన్నట్లుగా తెలుస్తోంది.
దీంతో తప్పు తెలుసుకున్న లోకేష్ సారీ చెప్పి జయంతి శుభాకాంక్షలు అని సవరించుకున్నారు. సరే ఇదిలా ఉంటే, లోకేష్ పొరపాటున తప్పు దొర్లాడే అనుకో.. 'వర్థంతి శుభాకాంక్షలు' అని ఎవరైనా చెబుతారా? అదీ మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి. ఏదేమైనా ఇలాంటి తప్పిదాలతో లోకేష్ ప్రతిపక్షానికి మరింత చులకనైపోతున్నారన్నది మాత్రం వాస్తవం.