దమ్ముందా, మూడోసారి: జగన్కు లోకేష్, విజయమ్మను లాగిన టిడిపి
విశాఖ భూకుంభకోణం విషయంలో తనపై ఆరోపణలు చేసిన జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు.జగన్కు 24 గంటల సమయం ఇస్తున్నానని, దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు.
విజయవాడ: విశాఖ భూకుంభకోణం విషయంలో తనపై ఆరోపణలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు.
జగన్కు 24 గంటల సమయం ఇస్తున్నానని, దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. జగన్కు తాను సవాల్ విసరడం ఇది మూడోసారి లోకేష్ చెప్పారు.
పారిపోతావేం...
ఆధారాలు చూపించమంటే పారిపోతారెందుకని వైయస్ జగన్ను నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ను మళ్ళీ అడుగుతున్నానని, బహిరంగ చర్చకు సిద్ధమా? అని వ్యాఖ్యానించారు. అందరూ జగన్లా ప్రజల సొమ్మును దోచుకుంటారా అని ప్రశ్నించారు. మాది కీర్తి సంపాదన అని, జగన్ది అవినీతి సంపాదన అంటూ జగన్పై మంత్రి లోకేష్ విమర్శల వర్షం కురిపించారు.
జగన్ విమర్శలు.. విజయమ్మను లాగిన టిడిపి
విశాఖలో జగన్ చేసిన విమర్శలపై తెలుగుదేశం ధీటుగా స్పందిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలకు జగన్ కన్నతల్లి, వైసిపి గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కూడా విశాఖ ప్రజలు ఓడించారని చెప్పారు. విశాఖలో వైసిపిని తరిమి కొట్టాలన్నారు.
చర్చిద్దామా.. పరిటాల సునీత
టిడిపి మూడేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి పరిటాల సునీత వైసిపికి సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేతలు రాజధాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు కల్పంచారని, చివరకు భవనాల్లోకి వర్షపు నీరు వచ్చిందంటూ ప్రచారం చేశారని నిప్పులు చెరిగారు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోను ఓ వైపు ప్రజా సంక్షేమం, మరోవైపు అభివృద్ధి చేస్తున్న చంద్రబాబుపై, టిడిపిపై అసత్య ఆరోపణలు సరికాదన్నారు.
దమ్ముంటే చర్చకు రండి
వైసిపికి దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రి పరిటాల సునీత సవాల్ విసిరారు. లోటు బడ్జెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రూ.24వేల కోట్ల రైతు రుణమాఫీ, రూ.2వేల కోట్ల డ్వాక్రా మహిళలకు రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, తాత్కాలిక రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానం చేపడుతున్న పనులు కనిపించడం లేదా అన్నారు.