ఢిల్లీ లో చెయ్యండి లొల్లి, ఇక్కడ కాదు: మంత్రి లోకేష్
ప్రత్యేక హోదా పై ఆందోళన చెయ్యాలనుకునేవారు ఢిల్లీ వెళ్లి చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు.
ప్రత్యేక హోదా పై ఆందోళన చెయ్యాలనుకునేవారు ఢిల్లీ వెళ్లి చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై కొన్ని సంస్థలు మళ్లీ ఆందోళనలకు పిలుపు నివ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ ముట్టడి చేయాలనుకోవడం ఏంటని ప్రశ్నించారు. మన అసెంబ్లీని మనమే ముట్టడించడం వల్ల ఉపయోగం ఏముంటుందని లోకేష్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వెళ్లి అక్కడ ధర్నా చేసుకోవాలని సూచన చేశారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదంటేనే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని, అందులో భాగంగానే అనంతపురానికి కియా, ఉపాధి హామీ పనుల కింద 16 వేల కోట్ల నిధులు వచ్చాయని లోకేశ్ చెప్పారు.ప్యాకేజీకి ఒప్పుకోకుంటే ఇవన్నీ ఎలా వచ్చేవని ప్రశ్నించారు. హోదా, ప్యాకేజీలపై ఏమాత్రం అవగాహన లేనివారు కూడా విమర్శలు చేస్తున్నారని లోకేష్ అన్నారు.
ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఏది రాలేదో చెప్పాలని నిలదీశారు. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను బట్టి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని ఆయన భావిస్తున్నట్లుగా అర్ధం చేసుకోవాలని పాత్రికేయులు విశ్లేషించుకున్నారు.