కరోనా అంటే వైసీపీ ప్రభుత్వానికి పిల్లలాట..కరోనా పరీక్షల విశ్వసనీయత ఇదేనా : నారా లోకేష్
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై, అలాగే కరోనా నియంత్రణ చేయలేకపోతున్న ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరీక్షలు ఆషామాషీగా చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని నారా లోకేష్ అన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించి చేస్తున్న కరోనా పరీక్షలలో నిర్లక్ష్యం తగదని నారా లోకేష్ హితవు పలికారు.
జగన్ రెడ్డి ఇళ్ళ స్థలాల అమ్మకం పథకం: సీఎం జగన్ టార్గెట్ గా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు
దీపక్ రెడ్డిని క్వారంటైన్ కు తరలించాలని హడావిడిపై లోకేష్ ఫైర్
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కరోనా అంటే పిల్లలాటగా మారిందని లోకేష్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన లోకేష్ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందని క్వారంటైన్ కి రమ్మని హడావిడి చేశారని పేర్కొన్నారు. అయితే గతంలో రెండు సార్లు దీపక్ రెడ్డి కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చిందని ఒక ఎమ్మెల్సీ విషయంలోనే ఇలా ఆటలాడితే ప్రజలతో ఇంకెన్ని ఆటలు ఆడుతున్నారు అంటూ నారా లోకేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కరోనా పరీక్షల్లో డొల్లతనం బయటపడింది
కరోనా పరీక్షలలో డొల్లతనం బయటపడిందని లోకేష్ వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్నామని చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా పరీక్షలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లోకేష్ మండిపడ్డారు. పాజిటివ్ అని నిర్ధారణ చేసుకోకుండా తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని క్వారంటైన్ లో పెట్టడానికి చేసిన హడావిడి చూస్తే ఇంకా ఏదైనా కుట్ర చేసిందా ప్రభుత్వం అని కూడా అనుమానాలు వస్తున్నాయి అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
పరీక్షల విశ్వసనీయత తేలాల్సిందే
ఛీట్ టెస్టింగ్ ఇన్ ఏపీ అంటూ ఏపీలో కరోనా టెస్టులలో మోసాలు జరుగుతున్నాయంటూ వరుస ట్వీట్లు చేశారు నారా లోకేష్. ఏపీ ప్రభుత్వ కరోనా పరీక్షల్లో డొల్లతనం బయటపడుతుందంటూ, అలాగే అనుగుణంగా ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు ఉన్నాయంటూ రెండు రిపోర్ట్ లను కలిపి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కరోనా పరీక్షలలో విశ్వసనీయత బయట పడాల్సిన అవసరం ఉందని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని లోకేష్ ప్రభుత్వాన్ని కోరారు.
టెస్ట్ లలో టాప్ అంటున్న ప్రభుత్వం ... టీడీపీ నేతల వ్యాఖ్యలతో అనుమానాలు
ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం దేశంలోనే కరోనా టెస్ట్ లలో ఏపీ టాప్ లో ఉందని పేర్కొన్నారు . కరోనా పరీక్షల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్తున్నారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు ఏకంగా 36,047 కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. కానీ తాజాగా టీడీపీ నేతల వ్యాఖ్యల నేపధ్యంలో కరోనా పరీక్షలపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.