బీజేపీ నేతలతో బుగ్గన భేటీ: 'ఒక్కసారి కలిస్తే ఇంత ఉలికిపాటా, లోకేష్ భయం దేనికి'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేష్ ధీటుగా స్పందిస్తున్నారు. గురువారం ఢిల్లీలో బీజేపీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారంటూ అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. శుక్రవారం మరో వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
బీజేపీ నేతలతో బుగ్గన కలవడంపై లోకేష్ స్పందిస్తూ... వైసీపీ, ఏపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో పెద్దలను ఈరోజు రహస్యంగా కలవడానికి గల కారణం ఏమై ఉంటుందంటూ ప్రశ్న ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సమాధానాలు ఇలా ఇచ్చారు. ఆపరేషన్ గరుడ, జగన్ కేసుల మాఫీ, తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు, లేకపోతే ఇవన్నీ అయి ఉండొచ్చా అని ట్వీట్ చేశారు.
మీరు సిద్ధమా
వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి ఉద్యోగాలపై విమర్శలు గుప్పించారు. దీనికి లోకేష్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘ఏపీకి 531 పరిశ్రమలు, లక్షా 29వేల 661కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 2.64 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని కేంద్ర పరిశ్రమల శాఖ సమాధానమిచ్చింది. ఇందుకే మిమ్మల్ని అసెంబ్లీ నుండి పారిపోవద్దని ముఖ్యమంత్రి పదే పదే విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు ఎక్కడ వచ్చాయో, ఉద్యోగాలు ఎక్కడ కల్పించామో చూపిస్తాం. పరిశ్రమల మంత్రి స్వయంగా మిమ్మల్ని తీసుకొని వెళ్తారు, మీరు సిద్ధమా' అని ట్వీట్ చేశారు.
లోకేష్ ఎందుకు భయపడుతున్నారు?
లోకేష్, యనమలలు ఎందుకు భయపడుతున్నారని బుగ్గన ప్రశ్నించారు. పీఏసీ చైర్మన్గా నివేదిక ఇవ్వాలనుకుంటే విజయవాడ, రాజమండ్రిలలో విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణలకు ఇచ్చేవాడిని అన్నారు. అర్ధరాత్రి దొంగాటలు మా పార్టీ సిద్దాంతం కాదన్నారు. రహస్యంగా బీజేపీ నేతలను కలవాల్సిన అవసరం లేదన్నారు. ఆకులను కలిసింది నిజమేనని, కానీఅమిత్ షాను, రామ్ మాధవ్లను కలిశానన్న ప్రచారం అవాస్తవమన్నారు.
ఒక్కసారి కలిస్తేనే ఇంత ఉలిక్కిపాటా?
తాను ఒక్కసారి ఢిల్లీకి వెళ్తేనే టీడీపీ నేతలు ఇంతలా ఉలిక్కిపడుతున్నారని బుగ్గన ఎద్దేవా చేసారు. నేను బీజేపీ నేతలు ఎవరితో మాట్లాడవద్దా అని ప్రశ్నించారు. టీడీపీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. తాను వ్యక్తిగత పనుల మీద ఢిల్లీకి వెళ్లానని చెప్పారు. ఏపీ భవన్లో అన్ని పార్టీల వారు ఉంటారన్నారు. అచ్చెన్నాయుడు మంత్రి అలా ఎయ్యారో అర్థం కావడం లేదన్నారు. ఆయనకు మెదడులేదని మరోసారి నిరూపితమైందన్నారు.
లోకేష్ ట్వీట్లు చూస్తే బురదజల్లే విధంగా
మంత్రి నారా లోకేష్ ట్వీట్లు చూస్తే ఎదుటివారిపై బురద జల్లే విధంగా ఉందని అంతకుముందు రోజు బుగ్గన అన్నారు. టీడీపీ నేతల మానసిక స్థితి ఉన్మాదానికి చేరిందన్నారు. తాను బీజేపీ ఎమ్మెల్యే ఆకులను ఏపీ భవన్లోనే కలిశానని చెప్పారు. చాటుమాటుగా కలవలేదని అభిప్రాయపడ్డారు.