వారసత్వంపై పవన్ కళ్యాణ్కు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్, జగన్ ఆస్తుల ప్రకటనపై సెటైర్
Recommended Video
అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి చురకలు అంటించారు. ఆస్తులపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నేతకు, వారసుల అంటూ కామెంట్ చేసిన జనసేనానికి దిమ్మతిరిగే షాకిచ్చారు.
వైయస్ జగన్, ఆయన పార్టీ నేతలు తమపై మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారని మొదట వాళ్లు ఆస్తులను తమ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతరులపై విమర్శలు చేసే ముందు మేం ఆ పని చేస్తున్నామా అని ఆలోచించాలన్నారు. ఆ తర్వాత తమ తప్పులు ఉంటే ఆరోపణలు చేయాలని అభిప్రాయపడ్డారు.
ఆస్తులు ప్రకటించిన నారా లోకేష్: ఎవరి ఆస్తులు ఎంత అంటే?
జగన్ ఆస్తులను సీబీఐ, ఈడీ ప్రకటిస్తున్నాయి
వైయస్ జగన్ ఆస్తులను ఈడీ, సీబీఐ ప్రకటిస్తున్నాయని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పుడూ సొంతంగా ఆస్తులు ప్రకటించలేదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్ పైన 17 కేసులు వేశారని, కానీ ఒక్క దానిని నిరూపించలేకపోయారన్నారు. జగన్ పోలవరం అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, పోలవరం ఆగిపోవాలని కోరుకుంటున్నారని, కానీ పవన్ మాత్రం పోలవరం త్వరగా పూర్తి చేయాలని చెబుతున్నారని చెప్పారు.
ఏపీలో ప్రతిపక్షం లేదు
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావొద్దని ప్రతిపక్ష వైసీపీ కోరుకుంటోందని లోకేష్ ఆరోపించారు. జగన్ పట్టిసీమను వ్యతిరేకించారని చెప్పారు. పోలవరం పునరావాస ప్యాకేజీ విలువ పెరగడం వల్లే ప్రాజెక్టు వ్యాల్యూ పెరిగిందన్నారు. ఏపీలో ప్రతిపక్షం లేనే లేదన్నారు. ప్రతిపక్షం మేమే, అధికార పక్షం మేమే అన్నారు.
పవన్ కళ్యాణ్కు లోకేష్ కౌంటర్
రాజకీయాల్లోకి వారసులు వస్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాదు, లోకేష్ను మంత్రిగా చేయడంపై మాట్లాడుతూ.. ఆయన సామర్థ్యం చంద్రబాబుకు తెలుసునేమో అని ఎద్దేవా చేశారు. దీనిపై లోకేష్ కౌంటర్ ఇచ్చారు.
వారసులను చూసి ప్రజలు ఓటేయరు
వారసులను చూసి ప్రజలు ఓటేయరని నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ఉన్న వారిని చూసి ఓటేస్తారని చెప్పారు. రాజకీయాల్లోకి వారసులు వచ్చిన మాట నిజమేనని, అయితే ప్రజామోదం ఉంటేనే ఆ వారసులు కూడా నిలబడుతారని, తాను కూడా అలాగే నిలబడుతానని పవన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. బీజేపీ-టీడీపీ మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం, వాల్మికీ, బోయలను ఎస్టీల్లో చేర్చడం వంటి ముఖ్య నిర్ణయాల సమయంలో వైసీపీ సభకు రాలేదన్నారు. నియోజకవర్గాల పెంపు అంశం చట్టం పరిధిలో ఉందని చెప్పారు. చంద్రబాబుపై నమ్మకంతోనే నేతలు వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు.