ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ: లోకేష్ స్పందన, పవన్ కళ్యాణ్కు గట్టి కౌంటర్
అమరావతి: 4 లోకసభ, 10 అసెంబ్లీస్థానాల ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. బీజేపీ ఆధిపత్య ధోరణి, మోసపూరిత విధానాలను ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ ఎప్పుడో కనుమరుగయిందని చెప్పారు..
ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీకి ముఖం చూపించలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఇకనైనా మేల్కోవాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపుపై అసత్య ప్రచారాలు మానుకోవాలని, ఏపీ హక్కుల కోసం ఢిల్లీ పెద్దలతో పోరాడాలన్నారు. బీజేపీ దక్షిణాదిని మరిచిపోవాలని, ఉత్తరాదిన ఆ పార్టీ రక్షించుకోవాలన్నారు.
హెరిటేజ్పై పవన్ కళ్యాణ్కు కౌంటర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే హెరిటేజ్ అంశాన్ని లేవెనత్తుతూ విమర్శించడంప నారా లోకేష్ స్పందించారు. ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టును హెరిటేజ్ సభ్యుడికి ఇచ్చానని జనసేనాని చెప్పడాన్ని తప్పుబట్టారు. ఆరోపణలు చేసేముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.
ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్ హరిప్రసాద్కు కట్టబెట్టారనంటున్నారని, ఆయన హెరిటేజ్ సభ్యుడని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యొద్దన్నారు. అలాగే, గిరిజనులకు ఏం చేయడం లేదన్న వ్యాఖ్యల పైనా స్పందించారు. గిరిజన ప్రాంతాలైన ఏడు నియోజకవర్గాల్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేశామన్నారు. నాలుగేళ్లలో గ్రామాల్లో 17 వేల కి.మీ సీసీ రోడ్లు వేశామన్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో 1100 కి.మీలు మాత్రమే సీసీ రోడ్లు వేశారన్నారు.