అది కూడా తెలియదా: పోసానికి లోకేష్ కౌంటర్, బాలకృష్ణ-కులంతో టీడీపీకి ఝలక్
నంది అవార్డుల వివాదం, ఓటు హక్కుపై తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు మండిపడుతుండటంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం స్పందించారు.
Recommended Video
అమరావతి: నంది అవార్డుల వివాదం, ఓటు హక్కుపై తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు మండిపడుతుండటంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం స్పందించారు. సినీ ప్రముఖులు పోసాని కృష్ణ మురళీ మంత్రి పైన తీవ్రంగా మండిపడ్డారు. మరికొందరు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి లోకేష్ కౌంటర్ ఇచ్చారు.
తనకు ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు లేకపోతే శాసన మండలి సభ్యుడిగా ఎలా అవుతానని లోకేష్ ప్రశ్నించారు. తాను ఎన్ఆర్ఏ (నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) వ్యాఖ్యలు చేయడంతో తన ఓటు హక్కు ఎక్కడ ఉందోనని కొందరు ఆరా తీస్తున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్సీని అనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. తన తనయుడు దేవాన్ష్కు ఉండవల్లిలోనే ఆధార్ కార్డు ఉందన్నారు.
నంది అవార్డులు ఎవరికిచ్చారు, ప్రభుత్వం లేదా టీడీపీతో సంబంధం ఎలా?
నేను ఎమ్మెల్సీని ఎలా అయ్యాను
ఆంధ్రప్రదేశ్లో తనకు ఓటు హక్కు లేకుంటే తాను శాసన మండలికి ఎలా వచ్చానో ఆలోచించాలన్నారు. అలాంటి అవగాహన కూడా లేని వారు తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తనకు ఏపీలోనే ఓటు హక్కు ఉందని స్పష్టం చేశారు.
లోకేష్ ఘాటు వ్యాఖ్యలు ఇవి
నంది అవార్డులపై సినీ రంగానికి చెందిన పలువురు విమర్శలు చేస్తున్నారు. దీనిపై సోమవారం లోకేష్ మాట్లాడుతూ.. ఏపీలో ఓటుహక్కు, ఆధార్కార్డు లేనివారు హైదరాబాద్లో కూర్చుని నంది అవార్డులపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ఎన్ఆర్ఏలు మాత్రమే విమర్శలు చేస్తున్నారన్నారు.
లోకేష్ పైన విమర్శలు
లోకేష్ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు మండిపడ్డారు. తాము ఎన్ఆర్ఏలమని లోకేష్ చెబుతున్నారని, మరి ఆయన ఎవరు అని పోసాని కృష్ణ మురళి ధ్వజమెత్తారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ కూడా లోకేష్ పైన నిప్పులు చెరిగారు.
కులం ఆపాదించవద్దంటూనే ప్రాంతాలను ఆపాదిస్తున్నారు
లోకేష్ వ్యాఖ్యలు సరికాదని జంగా గౌతమ్ విమర్శించారు. లోకేష్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నంది అవార్డులకు కులం ఆపాదించవద్దని చెబుతూనే, కళాకారులకు ప్రాంతాలు ఆపాదించే పనికి లోకేష్ పూనుకున్నారన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలోని సభ్యులను రేషన్ కార్డు, ఆధార్ కార్డులు చూసి నియమించారా అని ప్రశ్నించారు.
బాలకృష్ణ ఇల్లు ఎక్కడ, లోకేష్కు ఝలక్
ఇళ్లు ఎక్కడ ఉన్నాయో చూసి నటులకు అవార్డులు ఇచ్చారా అని జంగా గౌతమ్ నిలదీశారు. ఎక్కువ నంది అవార్డులు వచ్చిన బాలకృష్ణ ఇల్లు ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. దీనికి ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పగలదా అన్నారు. రాజకీయ ప్రమేయంతో నంది అవార్డుల ఎంపిక జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ప్రకటించిన అవార్డులు రద్దు చేయాలన్నారు.