మరోమారు పప్పులో కాలేసిన నారాలోకేష్ ... లోకేష్ ట్వీట్లపై నెటిజన్ల ట్రోల్స్
ఏపీ మంత్రి ఏపీ సీఎం తనయుడు నారా లోకేష్ మరోమారు పప్పులో కాలేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై , లోకేష్ పై జరుగుతున్న మాటల దాడిని తిప్పి కొట్టే క్రమంలో ఆయన పెట్టిన ట్వీట్లు పలు విమర్శలకు కారణం అయ్యాయి. నెటిజన్ల నుండి విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.
తెలంగాణా కు వర్తించని ఎన్నికల కోడ్ ఆంధ్రాకు వర్తిస్తుందా .. లోకేష్ ఫైర్
ఎన్నికల కోడ్ ఏపీకేనా.. తెలంగాణాకు వర్తించదా అంటూ లోకేష్ ట్వీట్.. నెటిజన్లు కౌంటర్
రాష్ట్రంలో ఎన్నికల నియమావళి పేరుతో ప్రభుత్వం చేసే సమీక్షలపై ఈసీ ఆంక్షలపై లోకేష్ ట్విట్టర్ ద్వారా చాలా ఘాటుగా స్పందించారు.ఎన్నికల సంఘం ఆంక్షలన్నీ ఒక్క టీడీపీకే వర్తిస్తాయా అంటూ లోకేష్ ఈసీని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ కేవలం ఒక్క ఏపీకే వర్తిస్తుందా అని లోకేష్ అన్నారు. "ఎండలు, తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తే ఈసీకి సమస్య ఎక్కడినుండి వచ్చిందో చెప్పాలని లోకేష్ అన్నారు. పాలనాపరమైన సమీక్షలకు కూడా నో చెప్పటం ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఏపీ ప్రజల సమస్యలను గాలికి వదిలెయ్యమని చెప్పటం ఒక్క ఏపీలోనే వుంది అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జరిపే సమీక్షల్లో ప్రభుత్వ అధికారులు, పోలీసులు కూడా పాల్గొంటున్నారని, తెలంగాణాలో వర్తించని కోడ్ కేవలం ఏపీకే వర్తిస్తుందా.. అలా ఎలా అని లోకేష్ ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ఈ ట్వీట్ పై లోకేష్ కు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.
సోషల్ మీడియాలో లోకేష్ పై ట్రోల్స్... ఆయన ట్వీట్ పై పెద్ద రచ్చ
నారా లోకేష్ ఎప్పడు టంగ్ స్లిప్పయినా నెటిజన్లకు ఆయనపై కామెంట్స్ చెయ్యటం అలవాటైపోయింది . తాజాగా ఆయన చేసిన ట్వీట్లపై మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. ` ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే వుందా?. ఈసీ ఆంక్షలన్నీ ఒక్క తేదేపాకే వర్తిస్తాయా?.కోడి గుడ్డుపై ఈకలు పీకే మీ బుద్ధి మారదా?. తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారు. కేసీఆర్ సమీక్షలపై పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోంది. అక్కడ కోడ్ వర్తించదా? ఏంటీ పక్షపాతం` అంటూ నారా లోకేష్ పెట్టిన ట్వీట్లపై సోషల్ మీడయాలో మళ్లీ పెద్ద రచ్చ నడుస్తుంది .
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయని లోకేష్ కు హితవు చెప్తున్న నెటిజన్లు
ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. కానీ తెలంగాణలో జరిగింది మాత్రం పార్లమెంట్ ఎన్నికలే. అలాంటప్పుడు అక్కడి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఈసీ ఎందుకు జోక్యం చేసుకుంటుంది? అన్న విషయం మంత్రిగా పనిచేసిన నారా లోకేష్కు తెలియకపోవడం విచిత్రంగా వుందని, ఏదో ఒకటి ప్రశ్నించాలన్న వంకతో నారా లోకేష్ పప్పులో కాలేశారని నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మాత్రం తెలియకుండా లోకేష్ని ఎలా మంత్రిని చేశారని, ఇప్పటికైనా అతనికి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో చెప్పండని సెటైర్లు వేస్తున్నారు.