ఈ స్థాయిలో ఐటీ దాడులా? భయపెడతారా?: కేంద్రంపై నారా లోకేష్ ఆగ్రహం
Recommended Video
అమరావతి: ఐటీ దాడుల పేరుతో ఆంధ్రప్రదేశ్పై కేంద్రం కక్ష సాధిస్తోందని ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆరోపించారు. సోమవారం ఆయన అమరావతిలో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా 19 బృందాలు.. 200 మంది అధికారులు దాడులు చేయడం దారుణమన్నారు.
ఆంధ్రా యువకుడి అభిమానానికి ఫిదా! కేటీఆర్ ధన్యవాదాలు, అసలేం చేశారంటే.?
భయభ్రాంతులకు గురిచేస్తున్నారు..
‘ఏపీలో పెట్టుబడులు పెడుతున్నవారిని భయభ్రాంతులకు గురి చేస్తే మేం మాట్లాడకూడదా..? ఒకరిద్దరిపై గతంలోనూ ఐటీ దాడి చేస్తే పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా దాడులు చేస్తే పెట్టుబడులు వస్తాయా..?' అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఏక కాలంలో 23సంస్థలపై దాడులు చేస్తే అనుమానం రాదా? అని అన్నారు.
జైల్లో ఉండి వచ్చిన వారు మాట్లాడతారా?
రాష్ట్ర కంపెనీలను కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? అని లోకేష్ ప్రశ్నించారు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వారు కూడా విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడటమా..? అని లోకేష్ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భూకేటాయింపులపై ఆరోపణలు చేయడం సరికాదని.. ఆధారాలుంటే చూపించాలని కోరారు. ఇప్పటి వరకు తాము ఏడుసార్లు ఆస్తులు ప్రకటించామని.. ప్రతిపక్ష నేతలు కూడా ఆస్తులు ప్రకటించాలని సూచించారు.
బాబు కష్టపడుతుంటే ఇబ్బంది పెడతారా?
దేశంలోని టాప్-3 కంపెనీలు ఏపీకి వచ్చాయన్న లోకేష్.. పెద్ద కంపెనీలకు భూములివ్వడం తప్పా? అని ప్రశ్నించారు. ఈ చర్య రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటమేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కష్టపడుతుంటే ఇబ్బందులు పెట్టడం సరికాదని లోకేశ్ వ్యాఖ్యానించారు.
లక్ష ఐటీ ఉద్యోగాలే లక్ష్యం
సోమవారం సాయంత్రం గన్నవరంలోని ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ హెచ్సీఎల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను లోకేష్ ప్రారంభించారు. రెండు దశల్లో రూ.750 కోట్ల పెట్టుబడులతో నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నూతన క్యాంపస్కు భూమిపూజ చేశారు. హెచ్సీఎల్ నూతన క్యాంపస్ శిలా ఫలకంతో పాటు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. 2019 కల్లా ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏపీలో ఐటీ ఉద్యోగాలకు అవకాశాలు మెరుగయ్యాయన్నారు. భవిష్యత్తు తరాల ఉద్యోగాల కల్పనకు ఇది శుభ సంకేతమని తెలిపారు. ఇప్పటివరకు ఏపీకి వచ్చిన ఐటీ కంపెనీల్లో హెచ్సీఎల్ అతిపెద్దదని, ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలో ఇదో ప్రత్యేకమైన రోజు అని అభివర్ణించారు.