జగన్ ఇచ్చే చిల్లర కోసం నాపై ఇలాంటి తప్పుడు ప్రచారామా?: నారా లోకేష్ ఫైర్
అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిల్లర కోసం ఆశపడి తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 2015లో తాను అమెరికా పర్యటనకు వెళ్లినప్పటి పాత ఫొటోలతో కొత్త కథ అల్లారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిల్లర కోసం ఇలానా? పెంచమనండి..
‘ఇంకా పోస్ట్ కి ఐదు రూపాయిలే ఇస్తున్నారటగా కాస్త ఎక్కువ అడగండి స్వామి. జే ట్యాక్స్ కోట్లలో వసూలు చేస్తున్నారు మీకు మాత్రం ఐదు రూపాయిలే వేస్తే ఎలా?' అంటూ నారా లోకేష్ సెటైర్లు వేశారు.
విమర్శనాస్త్రాలు
వైఎస్ జగన్ సర్కారుపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాుల కొనసాగిస్తూనే ఉన్నారు. ‘సొంత మీడియాలో పనిచేసే పరివారానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి లక్షల్లో జీతం పెంచేసారు. ఇన్ని పెంచిన జగన్ గారు సంక్షేమానికి మాత్రం కోతలు పెడుతున్నారు. అవ్వా, తాతలకు నెలకు 250, రైతులకు 600 మాత్రమే ఇస్తూ, రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ పిట్ట కథలు చెబుతూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు' అని లోకేష్ ధ్వజమెత్తారు. ‘వైఎస్ జగన్ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పెంచుకుంటూ పోతూ, ఉల్లిధర 100చేసి సెంచరీకొట్టారు. ఇసుకధర ఐదురెట్లు పెంచారు. వైకాపా కార్యకర్తలకు 5వేల జీతాన్ని 8వేలు చేసి సంవత్సరానికి 4వేలకోట్ల ప్రజాధనం రివర్స్ టెండర్ పెట్టారు. సొంతపత్రికకు 200శాతం ప్రకటన రేట్లుపెంచి దోపిడీచేస్తున్నారు' అని లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆ వార్తల్లో నిజం లేదు..
ఇది ఇలావుండగా, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విజయనగరంలో మాట్లాడుతూ.. ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలో నిజం లేదని, ప్రస్తుతం ఏ ఒక్కరూ టీడీపీని వీడరని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
జగన్ నోరు మెదపడం లేదే...?
రాజధానిపై మంత్రులు పూటకోమాట మాట్లాడుతున్నారని కళా వెంకట్రావు విమర్శించారు. 22 మంది ఎంపీలు ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంత్రుల్లో అసహనం పెరిగిపోయి తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.