నిరుద్యోగులు కుక్కలా? వేలకోట్లు దోచినందుకు చప్పట్లు కొట్టాలా?: వైఎస్ జగన్పై లోకేష్ నిప్పులు
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి ధర్మాన కృష్ణదాస్పై మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగులను కించపరుస్తూ మాట్లాడటం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. నరసన్నపేటలో జరిగిన జాబ్ మేళాలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు.
మోడీ పలకరింపు, సుజనా వ్యాఖ్యలు: వైఎస్ జగన్తో భేటీపై రఘురామ కృష్ణరాజు క్లారిటీ
ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారా?
‘సొంత మీడియాలో పనిచేసే పరివారానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి లక్షల్లో జీతం పెంచేసారు. ఇన్ని పెంచిన జగన్ గారు సంక్షేమానికి మాత్రం కోతలు పెడుతున్నారు. అవ్వా, తాతలకు నెలకు 250, రైతులకు 600 మాత్రమే ఇస్తూ, రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ పిట్ట కథలు చెబుతూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు' అని లోకేష్ ధ్వజమెత్తారు.
దోపిడీ చేస్తున్నందుకు చప్పట్లు కొట్టాలా?
‘వైఎస్ జగన్ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పెంచుకుంటూ పోతూ, ఉల్లిధర 100చేసి సెంచరీకొట్టారు. ఇసుకధర ఐదురెట్లు పెంచారు. వైకాపా కార్యకర్తలకు 5వేల జీతాన్ని 8వేలు చేసి సంవత్సరానికి 4వేలకోట్ల ప్రజాధనం రివర్స్ టెండర్ పెట్టారు. సొంతపత్రికకు 200శాతం ప్రకటన రేట్లుపెంచి దోపిడీచేస్తున్నారు' అని లోకేష్ సెటైర్లు వేశారు.
వేలకోట్లు దోచి.. మోసం చేసినందుకా?
‘వైకాపా కార్యకర్తలకు గ్రామవాలంటీర్ల పేరుతో ఉద్యోగాలు ఇచ్చి ఏడాదికి 4వేల కోట్ల ప్రజాధనం దోచేస్తున్నందుకు చప్పట్లు కొట్టాలా? గ్రామసచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షాపత్రాన్ని లీక్ చేసి పేపర్ 5లక్షలకు అమ్ముకొని 19లక్షల మంది నిరుద్యోగ యువతను మోసం చేసినందుకు చప్పట్లు కొట్టాలా?' అని లోకేష్ విమర్శించారు.
నిరుద్యోగులు కుక్కలా?
మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగులను ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలతో అవమానిస్తారా? అని ధ్వజమెత్తారు. ఇదే తరహా పరిపాలన సాగితే నిరుద్యోగ యువత జగన్ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టడం ఖాయమన్నారు.
ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలు విమర్శలు
కాగా, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శుక్రవారం జరిగిన జాబ్ మేళాలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి.. సీఎం పనితీరును ప్రస్తావించినప్పుడు సభలో చప్పట్లు కొట్టకపోవడంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ధర్మాన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.