శకునిమామతో కలిసి నీచరాజకీయాలు: కోడెల లేఖను బయటపెట్టిన లోకేష్
అమరావతి: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.
'ఐపీసీ 420 కింద కేసులున్న ప్రబుద్ధులు అలాంటి పనులే చేస్తారని పెద్దలంటుంటారు @ysjagan గారు! కోడెలగారి విషయంలో కూడా మీరు అదే చేశారు. నిబద్ధత కలిగిన వ్యక్తిగా కోడెలగారు హుందాగా వ్యవహరించి మీ స్పీకర్ గారికి లేఖకూడా రాశారు. ఆయన కూడా అందిందని సంతకం చేశారు. అలాంటప్పుడు కేసులెలా పెడతారు?' అని లోకేష్ నిలదీశారు.
'ఇదంతా మీరు, మీ శకునిమామ @VSReddy_MP కలిసి కోడెల గారిని మానసికంగా దెబ్బతీసేందుకు, సమాజంలో వారికున్న మంచిపేరును చెడగొట్టేందుకు పన్నిన కుట్ర కాదా? మీరు దొంగలు అయినంత మాత్రాన అందరూ అలాంటివారి అనుకుంటే అంతకంటే నీచమైన ఆలోచన ఇంకొకటి ఉండదు' అని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
'నీచ శవరాజకీయాలలో మీకు మీరే సాటని మరోసారి నిరూపించుకున్నారు@ysjagan గారు. మీ శకుని మామ @VSReddy_MP పర్యవేక్షణలో కంచేటి సాయి అనే తోలుబొమ్మని అడ్డంపెట్టుకుని, విదేశాల్లో ఉన్న కోడెల గారి కుమారుడే ఈ ఆత్మహత్యకి కారణమని కేసు పెట్టించారు’ అని ధ్వజమెత్తారు.