టీవీలో చూశా కానీ..: శాసనమండలిలో నారా లోకేష్ తొలి ప్రసంగం సాగిందిలా..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శాసనమండలిలో తొలి ప్రసంగం చేశారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ..
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శాసనమండలిలో తొలి ప్రసంగం చేశారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. తాను ఇప్పటి వరకూ శాసనసభ, మండలి సమావేశాలను టీవీల్లో మాత్రమే చూశానని, ఇప్పుడు ప్రత్యేక్షంగా పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.
సమావేశాలు ఎంతో పద్ధతిగా సాగుతున్నాయని నారా లోకేష్ తెలిపారు. మండలి అధ్యక్షుడు హౌస్ను ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నారని కితాబిచ్చారు. ప్రతిపక్ష సభ్యులు కూడా సమావేశాలకు సహకరిస్తున్నారని చెప్పారు.
ప్రతిపక్షం చక్కటి అభిప్రాయాలను ఇస్తోందని, ఇలాగే అసెంబ్లీలో కూడా పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తనను ఎంతో మంది సభ ఎలావుందని అడుగుతున్నారని, ఇక్కడ కూర్చోవడం ఓ సరికొత్త అనుభూతిని ఇస్తోందని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.
తనకు శాసనమండలిలో సభ్యత్వం కల్పించినందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. శాసనమండలి వైస్ ఛైర్మన్గా బాధ్యతలు చేపడ్తున్న సుబ్రహ్మణ్యంకు నారా లోకేష్ అభినందనలు తెలిపారు.
తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలరని చెప్పారు. పార్టీ తనపై ఉంచిన బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని అన్నారు. ఆయన ప్రసంగం క్లుప్తంగా సాగింది. గురువారం ఎమ్మెల్సీగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.