'లోకేష్ సీఎం కొడుకైతే గొప్పా, ముద్రగడపై బాబును మంత్రులే నిలదీశారు'
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకువైతే ఏమైనా గొప్పవాడివా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన భగ్గుమన్నారు. వైసిపి అధినేత జగన్కు లేఖ రాయటం పట్ల అంబటి విమర్శలు గుప్పించారు.
చవకబారు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను నారా లోకేష్ నిలదీస్తున్నట్లుగా ఉన్న ఫోటోను తెలుగుదేశం పార్టీనే తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిందని గుర్తు చేశారు. దాని పైన నెటిజన్లే విస్తృతంగా చర్చలు జరిపారన్నారు.
పలు న్యూస్ సైట్లలోను ఈ ఫోటోతో సహా కథనాలు వెలువడ్డాయన్నారు. చినరాజప్పకు తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆ ఫోటోకు వక్రభాష్యాలు జోడించి నిరాధార వార్తలు సాక్షిలో ప్రచురించారని లోకేష్ చెప్పడాన్ని అంబటి ఖండించారు. దీనిపై వివరణ ఇచ్చారు.
అసలు మంత్రివర్గంతో లోకేష్కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. చవకబారు రాజకీయాలు, కుల రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
కేవలం ముద్రగడ అనే ఇంటి పేరు ఉందని చాలా ఎళ్లుగా సీఎస్వోగా పని చేస్తున్న ముద్రగడ నాగేందర్ అనే ఆయననను తొలగించారని, ఇదేమిటని స్వయంగా మంత్రులే ప్రశ్నిస్తే ఎవరినీ నమ్మరాదని చెప్పి కుల రాజకీయాలు చేసింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు కొడుకైనంత మాత్రాన లోకేష్ గొప్పవాడు అయిపోడని, సామర్థ్యాల మీద ఆధారపడి గుర్తింపు వస్తుందన్నారు.