ఇదీ రాలిపోయిన రత్నమేగా!: రివర్స్ టెండరేశారంటూ జగన్పై లోకేష్ ఫైర్, వీడియో ట్వీట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకాన్ని మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఇచ్చిన హామీకి ఇప్పుడు అమలు చేస్తున్న పథకానికి చాలా తేడా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. లక్షలాది మంది రైతులను ఈ పథకం కింద లబ్ధిపొందకుండా చేశారంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు.
మోసం చేశారంటూ..
పాదయాత్ర సమయంలో రైతులకు రూ. 12,500 ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ, ఇప్పుడు కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇచ్చే పెట్టుబడి సాయం కలిపి ఇస్తున్నారని ఆరోపించారు. 85లక్షల మంది రైతులకు రైతు భరోసా కల్పిస్తామని చెప్పి.. ఇప్పుడు కేవలం 40లక్షల మంది రైతులకే రైతు భరోసా ఇస్తున్నారని మండిపడ్డారు. రైతులను మోసం చేశారంటూ ధ్వజమెత్తారు.
రాలిపోయిన రత్నమేగా..
‘85లక్షల మంది రైతులకు రూ.12500 ఇస్తామని మీరన్నమాట మళ్లీ ఒకసారి చూడండి విడతల ముఖ్యమంత్రిగారూ! ఏరు దాటి తెప్ప తగలబెట్టినట్లు ఇప్పుడు కేవలం 40 లక్షలమందికే రైతుభరోసా అని ఇచ్చేది కేవలం రూ.7,500. రైతులకు రుణమాఫీ రద్దు చేశారు, ఇప్పుడు 45లక్షలమంది రైతులకు కనీస సాయం కూడా రాలిపోయిన రత్నమేగా!'అంటూ ఓ వీడియో ట్వీట్ చేసి చురకలంటించారు నారా లోకేష్.
రివర్స్ టెండరేశారంటూ..
‘వాయిదా పద్ధతి సీఎం @ysjagan గారూ, మీరు ప్రవేశపెట్టింది "వైఎస్ఆర్ రైతునిరాశ" కార్యక్రమం. ఎన్నికల హామీలో రైతుభరోసా కింద రూ.12,500 ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కేవలం రూ.7,500 ఇస్తూ రైతులకూ రివర్స్ టెండరేశారు. 64 లక్షలమంది రైతుల్లో సగం మందిని తగ్గించుకుంటూ పోయారు.
#JaganCheatedFarmers' అని లోకేష్ మండిపడ్డారు.
ఓసీలకు మొండిచెయ్యి...
‘కులాన్ని చూడము అంటూనే ఓసీలైన కౌలు రైతులకు మొండిచెయ్యి చూపారు. పెట్టుబడి సాయం ఒకేసారి ఇస్తామని మాటిచ్చి విడతల్లో ఇస్తూ మడమ తిప్పారు. మీ పార్టీ వాలంటీర్లకి నెలకు రూ.8000 ఇస్తూ.. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు మాత్రం రూ.625 ఇవ్వడం న్యాయమా?' అంటూ లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.