జగన్ గారూ! మీ ధన దాహానికి అడ్డేలేదా? విజనరీ లీడర్కి, పాయిజన్ లీడర్కి తేడా ఇదే..: లోకేష్ నిప్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా, ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మీ ధన దాహానికి అడ్డేలేదా?
‘జగన్ గారు మీ ధన దాహానికి అడ్డులేదా? 4 మంది కార్యకర్తలకు ప్రజా ధనాన్ని దోపిడీ చెయ్యడానికి 10 లక్షల మంది ఉద్యోగాలు తీసేస్తారా. మహిళల జోలికి వచ్చిన వాడు మసైపోతాడు గుర్తుపెట్టుకోండి' అంటూ నారా లోకేష్ ధ్వజమెత్తారు.
అదే తేడా..
‘విజనరీ లీడర్కి, పాయిజన్ లీడర్ కి తేడా ఏంటో తెలుసా? విజన్ ఉన్న లీడర్ రాబోయే సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి నివారణ చర్యలు తీసుకునేవారు విజనరీ లీడర్. పట్టిసీమ అలాంటి ఆలోచన నుండి పుట్టిందే' అని చంద్రబాబునాయుడుతో పోల్చుతూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
పాయిజన్ లీడర్ ముందు చూపు లేకే..
‘పాయిజన్ ఉన్న లీడర్ ముందు చూపు లేక వరదలు వచ్చినా వినియోగించుకోలేక ప్రజల్ని ముంచి నీటిని సముద్రంపాలు చేస్తారు. పై రాష్ట్రాల నుండి ఎంత వరద వచ్చినా ఆఖరికి రాష్ట్ర నీటి అవసరాలు తీర్చడానికి.. పనికిరాని పట్టిసీమ అన్నవారితోనే మళ్లీ మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వచ్చింది' అంటూ లోకేష్ విమర్శించారు.
ఆత్మహత్యలను అవహేళన చేస్తారా?
‘తూర్పుగోదావరి జిల్లా లో మరో భవన నిర్మాణ కార్మికుడు ధనరాజు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. కార్మికులు పిట్టల్లా రాలిపోతుంటే మంత్రులు ఆత్మహత్యలను అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నాను' అని నారా లోకేష్ ధ్వజమెత్తారు.
ఇంత బాధ్యతరాహిత్యమా?
‘కాలం చెల్లి పోతున్నారు అని ఒక మంత్రి, వరద వస్తే ఇసుక రాదు అన్న కామన్ సెన్స్ కార్మికులకు లేదా అని ఇంకో మంత్రి. ఇప్పుడు పోలీసులే అక్రమ ఇసుక రవాణాకి పాల్పడుతున్నారు, లారికి పోలీసులు 5 వేలు వసూలు చేస్తున్నారు అని బాధ్యతా రహిత్యంగా మరో మంత్రి మాట్లాడుతున్నారు' అని లోకేష్ మండిపడ్డారు.
ఇసుకాసురుల పాపం పండుతుంది...
‘ఇసుక కొట్టేస్తుంది, ఇతర రాష్ట్రాల్లో అమ్మేస్తుంది, కార్మికులను చంపేస్తుంది వైకాపా నాయకులే కదా, తమ తప్పుని పోలీసులపై నెట్టేసే కుట్ర ప్రారంభమైంది. ఎన్ని కుయుక్తులు పన్నినా భవన నిర్మాణ కార్మికులను మింగేసిన వైకాపా ఇసుకాసురుల పాపం పండుతుంది' అని లోకేష్ దుయ్యబట్టారు.