వైసీపీ అరాచకాలివే.. మంత్రుల దౌర్జన్యం: లోకేష్ బహిరంగ లేఖ, వీడియో పెట్టి మరీ..
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ బహిరంగ లేఖను రాశారు. ఏపీ అసెంబ్లీ, శాసనమండలిలో వైసీసీ సభ్యులు గూండాగిరి చేశారని విమర్శించారు.
గూండాల్లా దాడి చేసిన మంత్రులు..
‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం. దేవాలయంలాంటి శాసనమండలిలో ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చలా వ్యవహరించిన వైకాపా ప్రభుత్వం తీరు, గూండాల్లా దాడి చేసిన మంత్రుల వ్యవహారశైలిని ప్రపంచం ముందుకు తెచ్చేందుకు ఒక బాధ్యత కలిగిన శాసనమండలి సభ్యుడిగా ఈ బహిరంగలేఖ విడుదల చేస్తున్నాను' అని నారా లోకేష్ తెలిపారు.
లైవ్ టెలికాస్ట్ ఆపి.. మంత్రుల దౌర్జన్యం..
‘ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో వైకాపా వ్యవహరిస్తున్న తీరు మీరు చూసే ఉంటారు. 2014 రాష్ట్ర విభజనను ఎంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా పార్లమెంటు తలుపులు మూసి, లైవ్ టెలికాస్ట్ ఆపివేసి, ఏపీ ఎంపీలపై దాడిచేసి మూకబలంతో బిల్లు తెచ్చారో! అదేవిధమైన దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చోటుచేసుకున్నాయి. ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలకు పాలకపక్షం పాల్పడటం ప్రజాస్వామ్యానికి చీకటిరోజు. మండలిలో సభ్యులు కాని మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలపై దాడులకు దిగారు. మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపేశారు. ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. కరెంటు కట్ చేశారు. ఇటువంటి సమయంలో గౌరవ అధ్యక్షస్థానంలో ఉన్న షరీఫ్ గారి వైపు ఒక్కసారిగా వైకాపాకి చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు దూసుకొచ్చారు. చైర్ని చుట్టుముట్టారు. చైర్మన్ ని అంతుచూస్తామని బెదిరించారు. ఇతర టీడీపీ సభ్యులపైనా మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. మండలి సభ్యుడిగా ఫోన్లో ఎటువంటి వీడియోలు చిత్రీకరించకూడదు. కానీ వైకాపా మంత్రులు తమ పంతం నెగ్గించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తాం అంటూ హెచ్చరిస్తుండటంతో చైర్మన్ గారు, ఇతర ఎమ్మెల్సీల భద్రత కోసం తప్పనిసరై వీడియో తీశాను. విలువలు, విశ్వసనీయత అంటూ లెక్చర్లు దంచే సీఎం జగన్, వైకాపా మంత్రులు మండలిలో ఎలా ప్రవర్తించారో ప్రజలు ముందుంచే ప్రయత్నమే ఇది' అని లోకేష్ వ్యాఖ్యానించారు.
మహిళా ఎమ్మెల్సీపై దాడికి యత్నం.. తలదించుకునేలా..
‘21వ తేదీన మండలి సమావేశాలు ప్రారంభం కాగానే రూల్ 71కింద శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. గందరగోళం సృష్టించింది. ఐదు సార్లు వాయిదా పడ్డ శాసనమండలి సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్ధిక మంత్రి బుగ్గన, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స శాసనమండలిలో ప్రవేశపెట్టారు. రూల్ 71పై చర్చ ప్రారంభమైంది. మండలి సమావేశాలు జరుగుతున్నంత సేపూ వైకాపా మంత్రులు, సభ్యుల ప్రవర్తన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ప్రత్యక్ష ప్రసారాలు ఆపేయించారు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్సీ గిరిజన మహిళ అయిన గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ గారు డమ్మీ కాన్వాయ్ లో వెళ్లే పరిస్థితి ఎందుకొచ్చిందని అడిగినందుకు 16మంది మంత్రులు ఆమెపై దాడికి ప్రయత్నించారు. మహిళ అనే కనికరం లేకుండా వ్యవహరించారు. సభలో మాట్లాడేందుకు యత్నించిన టీడీపీ ఎమ్మెల్సీలు బుద్ధా, నాగజగదీశ్వరరావు, అశోక్బాబుల గొంతు నొక్కేందుకు వైకాపా మంత్రులు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా మీదపడ్డారు. ఇవేనా సభావ్యవహారాల మంత్రి బుగ్గన గారు ప్రవచించిన విలువలు? తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఛైర్మన్ షరీఫ్ ఓటింగ్ నిర్వహించారు. రూల్ 71 తీర్మానానికి అనుకూలంగా 27, వ్యతిరేకంగా 11, తటస్థంగా 9 ఓట్లు పడ్డాయి' అని లోకేష్ తెలిపారు.
ప్రసారాలు ఆపేసి.. విజయసాయి బేరసారాలు
‘22వ తేదీన మండలి సమావేశం ప్రారంభం కావడంతోనే సిఆర్డిఏ, మూడు ముక్కల రాజధానుల బిల్లుల చర్చ ప్రారంభమైంది. సభలోకి 22 మంది మంత్రులు ప్రవేశించి సభ్యులపై బెదిరింపులకు దిగారు. ఈ దశలో మండలి ప్రత్యక్ష ప్రసారాలు ఆపేశారు. మండలిలోని ఛాంబర్లలో ఉన్న టీవీల్లో సైతం ప్రసారాలు రాకుండా చేసారు. చైర్మన్ పునరుద్ధరించాలని ఆదేశించినా ప్రసారాలు పునరుద్ధరించలేదు. మండలి సభ్యుల్ని ప్రలోభపెట్టేందుకు సభ్యులు కాకపోయినా విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు గ్యాలరీల్లో ఉండి మంతనాలు ప్రారంభించారు. చైర్మన్ రూమ్కి చేరిన మంత్రులు ఆయనను బెదిరించేందుకు ప్రయత్నించారు. అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి మండలిలో సభ్యుడు కాకపోయినా గ్యాలరీలోకి చేరి ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నించడం నేరం కాదా? ఎవరినీ ప్రలోభాలకు గురిచేయకూడదనే నిబంధనలకు లోబడి విజయసాయి రెడ్డికి బెయిల్ ఇచ్చారు. ఆయన మండలిలో బేరసారాలు సాగించడం ప్రజాస్వామ్యమా? ధనస్వామ్యమా? మూడు ముక్కల రాజధాని పై చర్చ పూర్తయిన తరువాత బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపాలని మేము డిమాండ్ చేసాం. దానికి వైకాపా మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసారు. చైర్మన్ ఇరు పక్షాలను పిలిచి తన చాంబర్లో మాట్లాడుతున్న సందర్భంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి క్లారిఫికేషన్ ఇస్తుండగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆయనపై దాడి చేశారు. ఆ తరువాత మండలి చైర్మన్ రోజంతా జరిగిన పరిణామాలు వివరిస్తున్న సందర్భంలో వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కాగితాలు చించేసి విసిరేశారు. చైర్మన్ ముందున్న టేబుల్పైకి ఎక్కిన మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడ్నించే వేలు చూపిస్తూ చైర్మన్ షరీఫ్ని బెదిరించారు. చైర్మన్ సీటు ముందున్న ఓ కుర్చీ ఎక్కిన మంత్రి కొడాలి నాని నేరుగా చైర్మన్నే దుర్భాషలాడారు' అని నారా లోకేష్ వెల్లడించారు.
రౌడీ రాజకీయం.. మంత్రుల అరాచకం..
‘తన విచక్షణాధికారం ఉపయోగించి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు ప్రకటించి సభని నిరవధికంగా వాయిదా వేసినట్టు ప్రకటించిన చైర్మన్ తన ఛాంబర్ కు వెళ్లిపోతుండగా అసభ్య పదజాలంతో మంత్రి బొత్స సత్యనారాయణ షరీఫ్ గారిని దూషించారు. మతం పేరును ఉచ్ఛరిస్తూ.. ఆయనని కించపరచడం రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన షరీఫ్ మచ్చలేని మనిషి. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలోనూ, మండలి చైర్మన్ గానూ పరుషంగా మాట్లాడిన సందర్భం లేదు. అటువంటి సమున్నతమైన వ్యక్తిని పట్టుకుని దుర్భాషలాడటం నన్ను తీవ్రంగా బాధించింది. మూడేళ్లుగా శాసనమండలిలో ఉన్నాను. ఏ ఒక్కరోజు చైర్మన్ని, సభ్యుల్ని ఎవ్వరూ దూషించడం జరగలేదు. వైకాపా రౌడీ రాజకీయాలు నవ్యాంధ్రప్రదేశ్ మండలి చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచాయి. వైకాపా వాళ్ల చిన్నబుద్ధితో పెద్దల సభ అయిన మండలి గౌరవాన్ని మంటగలిపేశారు. మార్షల్స్ రక్షణగా నిలవకపోతే చైర్మన్ గారికి రక్షణ కూడా ప్రశ్నార్థకమైన పరిస్థితి. తన నిరంకుశ నిర్ణయాలు ఒప్పుకోని మండలి చైర్మన్పై దాడి చేయడానికి వెనుకాడని జగన్, మూడుముక్కల రాజధాని బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని జీర్ణించుకోలేక శాసనమండలి రద్దుకు తెగబడటం రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే. రాజధాని వికేంద్రీకరణ పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్న జగన్.. బిల్లు ప్రజాభిప్రాయానికి వెళితే ఎందుకు ఉలికి పడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. కులం, మతం, ప్రాంతం పేరుతో విభజించి పాలించే ఎత్తుగడే తప్పించి.. ఇందులో ఎటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ లేదని ప్రజలు గమనించాలి. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైకాపా ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ప్రజలంతా ఐకమత్యమై ఉద్యమించాలి- ఇట్లు, మీ నారా లోకేష్, ఎమ్మెల్సీ అని ముగించారు.