జగన్ గారూ! మీ పేపర్లలోనే ఇసుక! మీ మంత్రి గారిది చాలా గౌరవమైన భాష: నారా లోకేష్ ట్వీటేశారు
అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా పలు అంశాలపై స్పందిస్తూ విమర్శల దాడిని కొనసాగించారు.
పేపర్లలోనే ఇసుక
‘మీ నూతన ఇసుక పాలసీ వలన 50 మంది కార్మికులు బలైయ్యారు. నిర్మాణ రంగం పడకేసి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ఇసుక రేటుని మీ నాయకులు పెంచుకుంటూ పోతున్నారు. మీ పత్రికలో ప్రకటనలకు కోసం వృధా అవుతున్న ప్రజాధనంతో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటే సంతోషిస్తాం' అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికీ గెలిపిస్తూనే..
‘ఎన్నికల సమరంలో చంద్రబాబు గారు ఓడిపోయినా, ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం, ఇప్పటికీ గెలిపిస్తూనే ఉన్నారు..' అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఇంతకన్నా నిదర్శనం కావాలా?
‘అత్యధిక సర్క్యూలేషన్ కలిగిన పేపర్లకు కాకుండా సాక్షి తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్స్ లో యాడ్స్ ఇవ్వడం ఏంటి? ప్రభుత్వ సొమ్ముని సాక్షికి మళ్లిస్తున్నారు అనడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా? ' అని లోకేష్ ఎద్దేవా చేశారు.
మీ గౌరవ మంత్రి గౌరవ భాష
‘వైఎస్ జగన్ గారు చెప్పింది సన్నంగా ఉన్న మంత్రిని పెడతా అని మాత్రమే. బియ్యం మాత్రం గడ్డకట్టిన బియ్యమే ఇస్తామని అన్నారు అంటారా? మీ ఇష్టం' అని లోకేష్ మండిపడ్డారు.
అంబులెన్స్ కూతలేవి జగన్ గారూ..
‘చంద్రబాబుగారి హయాంలో 108 కూత బాగానే వినబడింది. జగన్ గారి పాలనలోనే 108 కూత మూగబోయింది. కురుపాం నియోజకవర్గంలో 108 ఆపేశారంటే గిరిజనుల పై జగన్ గారికి ఎంత ప్రేమ ఉందో అర్ధం అవుతుంది. కొన్ని గిరిజన ప్రాంతాల్లో అంబులెన్స్ వెళ్లడం కష్టం కావడంతో టూ వీలర్ అంబులెన్స్ తీసుకొచ్చింది అప్పటి టిడిపి ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా ఉన్న 108 వాహనాలను కూడా నిలిపివేసింది వైకాపా ప్రభుత్వం. ఈ సమస్య ఒక్క కురుపాంలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది' అని నారా లోకేష్ విమర్శించారు.