అగ్రి గోల్డ్ బాధితుల కోసం బీజేపీ పోరాటంపై మంత్రి లోకేష్ వరుస ట్వీట్లు;"దొంగే, దొంగ...దొంగ అన్నట్లుగా
అమరావతి:అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా బిజెపి దీక్షలు ప్రారంభించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలపై తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఇప్పటికే టిడిపి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అగ్రి గోల్డ్ వ్యవహారంలో భాజపా తీరును తప్పుబడుతూ తీవ్రమైన విమర్శనాస్త్రాలు తాజాగా ఈ జాబితాలో మంత్రి నారా లోకేష్ కూడా చేరారు. ఆయన బిజెపిపై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. అగ్రి గోల్డ్ బాధితులు అన్ని రాష్ట్రాల్లో ఉండగా...ఎపిలో మాత్రమే బాధితులు ఉన్నట్లు బిజెపి నేతలు ఇక్కడ దీక్షలకు దిగడం వెనుక ఒక కుట్ర దాగి ఉందని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు.
బిజెపిపై లోకేష్...మొదటి ట్వీట్..
" దొంగే, దొంగ...దొంగ అని అరిచినట్లు బీజేపీ నేతలు దీక్ష చేసారు...నోట్ల రద్దు నుండి రఫెల్ కుంభకోణం వరకూ దేశాన్ని దోచేసి, దొంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్న బీజేపీ నాయకులు అగ్రిగోల్డ్ పేరుతో దొంగ దీక్ష చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది"...అని మంత్రి లోకేష్ తొలి ట్వీట్ చేశారు.
లోకేష్...రెండవ ట్వీట్..
"ప్రత్యేక హోదా నుండి తిత్లీ తుఫాను సహాయం వరకూ ఆంధ్రప్రదేశ్ దేశంలోభాగం కాదు అన్నట్టు వ్యవహరిస్తున్న బీజేపీ అగ్రిగోల్డ్ అంటూ కొత్త కుట్రకి తెరలేపింది. కోర్టు పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ అంశంలో బాధితులకు న్యాయం చెయ్యాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు"...అని లోకేశ్ రెండవ ట్వీట్ పెట్టారు.
లోకేష్...మూడో ట్వీట్..
" కోర్టులను కించపరుస్తూ బీజేపీ నేతలు ఆరోపణలు చెయ్యడం మాని, ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు బెయిల్ ఔట్ ప్యాకేజీ ప్రకటించాలి"...అని లోకేష్ తన మూడో ట్వీట్ పెట్టారు. దీంతో అగ్రి గోల్డ్ వివాదంపై ఇప్పటికే బిజెపి-టిడిపి నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతుండగా...తాజాగా లోకేష్ ఘాటు ట్వీట్ లపై బీజేపీ నేతలు ఎలా ప్రతిస్పందిస్తారనేది వేచి చూడాలి.