దొంగలకు దొంగల్లానే, రెచ్చగొడుతున్నారు: జగన్ను ఏకిపారేసిన లోకేష్
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవకాశం ఇస్తే తండ్రీకొడుకుల మధ్య కూడా చిచ్చుపెట్టగలిగే ఘనుడంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పీలేరు,పుంగనూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు.
రెచ్చగొట్టి విడదీస్తారు..
ఈ సందర్భంగా మహల్, పీలేరుల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. జగన్ దొంగ పత్రిక.. కుల, మత, ప్రాంతాల పేరిట రెచ్చగొట్టి ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పట్టిసీమ నీళ్లు వచ్చే అవకాశం లేదని రాయలసీమలో.. పట్టిసీమతో గోదావరి జలాలు రాయలసీమకు తరలిస్తున్నారని కోస్తాలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. పక్కపక్క గ్రామాల మధ్య చిచ్చుపెడుతున్నారని లోకేష్ మండిపడ్డారు.తిరుపతిలో చెత్తను కూడా రాజకీయం చేస్తున్నారు.
నాకు తండ్రికి మధ్య చిచ్చు..
ఆఖరికి తనకు, తన తండ్రికి మధ్య చిచ్చుపెట్టాలని చూశారని జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. టీడీపీ శిక్షణ కార్యక్రమానికి మెడనొప్పితో తాను వెళ్లలేదని, దీంతో తనకు, తన తండ్రికి విభేదాంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. అదే శిక్షణ కార్యక్రమాల్లోనే ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కింద కూర్చుని ఉండగా తాను వేదికపై నుంచి ‘ఏంటన్నా' అని చేయి ఊపితే దాన్ని రాజకీయం చేసి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆ దొంగ పత్రిక ప్రయత్నించింది' అని ధ్వజమెత్తారు.
పుట్టినప్పుడే తాత, చెడ్డీ వేసుకున్నప్పుడు తండ్రి..
తాను పుట్టేనాటికే తన తాత ముఖ్యమంత్రి అని, తను చెడ్డీతో స్కూలుకు వెళ్లే సమయానికే తన తండ్రి ముఖ్యమంత్రి అని గుర్తుచేశారు. తనపై ఏనాడైనా అవినీతి ఆరోపణలు వచ్చాయా? అని ప్రశ్నించారు. 2014 తర్వాతే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని రుజువు చేయాలని, చర్చకు రమ్మని 24 గంటలు గడువిచ్చినా ఎవరూ ముందుకు రాలేదని లోకేష్ అన్నారు.
దొంగలకు దొంగల్లానే..
దొంగలకు అందరూ దొంగల్లాగానే కనిపిస్తారని ఎద్దేవా లోకేష్ చేశారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా సీఎం రూ.25 వేల కోట్ల మేర రుణమాఫీ చేశారని, ప్రతి సంక్షేమ పథకంలో ప్రజలు పొందుతున్న లబ్ధిని అనేక రెట్లు పెంచారని గుర్తుచేశారు. రుణ మాఫీలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా లబ్ధి పొందారని, త్వరలోనే వారి జాబితా బయటపెడతామని చెప్పారు.
బాబు వేగాన్ని అందుకోలేకపోతున్నా..
34 ఏళ్ల వయస్సున్న తాను 67 ఏళ్ల చంద్రబాబు వేగాన్ని అందుకోలేకపోతున్నానని లోకేష్ అన్నారు. పల్లెసీమలకు సేవలందించాలనే ఉద్దేశంతోనే ఏరికోరి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రమూ రంజాన్ తోఫా అమలు చేయలేదని, మైనారిటీల పట్ల చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని లోకేష్ తెలిపారు.