కోడెల మృతికి ఆ ఇద్దరే కారణం, అసలు మనుషులేనా?: లోకేష్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య పరస్పర విమర్శలు ఆగడం లేదు. కోడెల ఆత్మహత్యకు కారణం మీరంటూ మీరేనంటూ టీడీపీ, వైసీపీ పార్టీల నేతలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.
శకునిమామతో కలిసి నీచరాజకీయాలు: కోడెల లేఖను బయటపెట్టిన లోకేష్
ఆ ఇద్దరే కారణం..
తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోడెల మరణానికి ఆ ఇద్దరే కారణమంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
విషం చిమ్ముతూనే..
‘అధికార దాహంతో, ఆనాడు మహామేత మొదలు పెట్టిన విషపత్రిక ఇప్పటికీ విషం చిమ్ముతూనే ఉంది. శవరాజకీయంలో ఆరితేరిన @ysjagan గారి ఆలోచనలకు అనుగుణంగా, దొంగలెక్కల A2 @VSReddy_MP గారి సారధ్యంలో నిజాలని కప్పేసి, కోడెల గారిమీద గత 3 నెలలుగా వైకాపా నేతలు ఎలా విషం కక్కారో చూడండి' అని లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అసలు మనుషులేనా?
‘ప్రజానేత కోడెల గారి వ్యక్తిత్వాన్ని తక్కువచేసి, మానసికంగా వేధించి, ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన వీళ్ళు మనుషులా? ఘనమైన నేరచరిత్ర వైకాపా నేతల సొంతం, సొంత తండ్రి శవంతో మొదలైన ఈ పైశాచిక క్రీడ కోడెల గారి మరణందాకా వచ్చింది. ఇంకెంతమందిని ఇలా బలి తీసుకుంటారో ?' అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు.