సీఎం జగన్ ఆదుకోండి: నాలుగు డిమాండ్లతో నారా లోకేష్ లేఖ
అమరావతి: పలు సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆదివారం ఓ లేఖ రాశారు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని, చేనేత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. వేలాదిమంది కుటుంబాలకు చేనేత జీవనోపాధికి మూలంగా ఉందని తెలిపారు. నాలుగు డిమాండ్లను సీఎం ముందుంచారు.
ఐదు నెలలుగా క్లిష్ట పరిస్థితులు
రాష్ట్రంలో 25 లక్షల మందికిపైగా చేనేత రంగం జీవనోపాధిని అందిస్తోందని లేఖలో ప్రస్తావించారు నారా లోకేష్.. ఆర్డర్లు లేక రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. మంగళగిరి, పొందూరు, చీరాల, వెంకటగిరి, ధర్మవరం, నెల్లూరులోని పొతూరు ఇలా అన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు. లాక్డౌన్, భారీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఐదు నెలలుగా వస్త్ర రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని లాక్డౌన్ వారి వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, తాజాగా కురిసిన భారీ వర్షాలతో వారు పనిచేసే ప్రదేశం నీటితో నిండిపోయిందని, దీంతో వారు పనులు ఆగిపోయాయని తెలిపారు.
నేతన్నల జీవితాలు దుర్భరంగా మారాయి..
ఒక్క మంగళగిరిలోనే వేలాది నేత కుటుంబాలు ఉన్నాయని లాక్డౌన్కు ముందు చేనేత కార్మికులు నెలకు 15-25 చీరలు తయారు చేసేవారని చెప్పారు. ఒక్కో చీరకి రూ. 450 నుంచి రూ. 550 వరకు సంపాదించే నేతన్నలు.. ఇప్పుడు నిత్యావసరాలు కూడా కొనలేని స్థితిలో ఉన్నారని లోకేష్ తెలిపారు. అప్పులపాలై దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నేతన్న నేస్తం పథక ప్రయోజనం ఎంతమాత్రం నెరవేరలేదన్నారు. మంగళగిరిలో 2490 చేనేత కుటుంబాలకు గానూ కేవలం 300 మంది మాత్రమే ప్రయోజనం పొందారని అన్నారు. రాష్ట్ర నేతన్నల తరపున తాను నాలుగు డిమాండ్లు ఉంచుతున్నట్లు, వీటికి పరిష్కారం చూపాలని లోకేష్ కోరారు.
లోకేష్ నాలుగు డిమాండ్లలో..
‘సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని, చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలంటూ వైఎస్ జగన్కి లేఖ రాసాను. సమస్య పరిష్కారానికి నేతన్నల తరపున 4డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతున్నాను. ఈ కరోనా సంక్షోభ సమయంలో ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి.
సొంత మగ్గం ఉన్న వారికే పథకం అంటూ నిబంధనల పేరుతో కోత విధించకుండా ప్రతీ నేత కార్మికునికి ‘నేతన్న నేస్తం' కింద రూ.24,000 ఇవ్వాలి. సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకోవాలనుకునే ప్రతి నేతన్నకి రూ.1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని ప్రభుత్వం అందించాలి. నేతన్న దగ్గర ఉన్న స్టాక్ని ఆప్కో ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేయాలి' అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.