ఆళ్లగడ్డపై నారా లోకేష్, కంటతడి పెట్టిన అఖిలప్రియ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక పైన వారు చర్చించారు. ఆళ్లగడ్డ నుండి పోటీ చేయాలని స్థానిక నేతలు ఒత్తిడి తెస్తుండగా.. అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సంప్రదాయం ప్రకారం ఆళ్లగడ్డలో నిలబెట్టవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోరుతోంది.
అమ్మలేని లోటు తీరనిది: అఖిల ప్రియ
అమ్మలేని లోటు తీరనిదని భూమా శోభానాగి రెడ్డి కూతురు, ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్న అఖిల ప్రియ శుక్రవారం కంటతడి పెట్టారు. నామినేషన్ సందర్భంగా అఖిల ప్రియ తల్లిని స్మరించుకున్నారు.
ఆమె ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు. ప్రజా సమస్యల కోసం పాటుపడతానని, ప్రజలలోనే ఉంటానని తెలిపారు. అమ్మానాన్న, ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో పోటీ చేస్తున్నానని తెలిపారు. అమ్మ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదన్నారు.
శోభా నాగిరెడ్డి మరణంతో ఈ ఎన్నిక జరుగుతుండటం బాధాకరమని భూమా నాగిరెడ్డి అన్నారు. శోభలేని లోటు భర్తీ చేయడం సులభం కాదన్నారు. అందరి అంచనాలకు తగ్గట్టుగా అఖిల పని చేస్తుందని తెలిపారు.
గత ఎన్నికల సందర్భంగా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పుడు నిర్వహించిన ఎన్నికలలో ఆమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.