లోకేష్ మాట్లాడుతుంటే టైం అయిపోయిందంటూ.., నేతలకు బాబు క్లాస్
ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతుండగా మైక్ కట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ఆసక్తికర సంఘటన విశాఖలోని మహానాడు వేదికపై సోమవారం జరిగింది. ఆయన సమయం మించి పోవడంతో అలారం మోగింది.
విశాఖ: ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతుండగా మైక్ కట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ఆసక్తికర సంఘటన విశాఖలోని మహానాడు వేదికపై సోమవారం జరిగింది. ఆయన సమయం మించి పోవడంతో అలారం మోగింది.
ఉదయం నారా లోకేష్ మహానాడు వేదికపై నుంచి ప్రసంగిస్తూ.. తొలుత ఎన్టీఆర్ను గుర్తు చేసుకుని, ఆ తర్వాత చంద్రబాబు కృషిని, కార్యకర్తల శ్రమను ప్రస్తుతిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఆయన మాట్లాడుతున్నారు.
ఎక్కడకు రమ్మంటారో చెప్పండి: జగన్కు లోకేష్ సవాల్
అప్పుడు మైకు పక్కనే ఉన్న గడియారం మోగింది. ఆపై గడియానాన్ని చేతిలోకి తీసుకున్న లోకేష్.. క్లాక్ మోగుతోంది.. ఒక్క నిమిషమే ఉంది, అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
మోగిన అలారం
నేతల ప్రసంగాల సమయాన్ని సూచించేందుకు, ప్రసంగం మొదలు కాగానే అప్పటి నుంచి అయిదు నిమిషాల సమయం తర్వాత అది మోగుతుంది. గడియారం మోగిన తర్వాత ఒక్క నిమిషంలో ప్రసంగాన్ని ముగించాల్సి ఉంటుంది. లోకేష్ ప్రసంగానికి వచ్చినప్పుడు కూడా దానిని ఆన్లో ఉంచారు.
కార్యకర్తల కేరింత
లోకేష్ మాట్లాడుతున్న సమయంలో తెలుగుయువత కార్యకర్తలు పదేపదే ఈలలు వేస్తూ, కేరింతలు కొట్టారు. దయచేసి వినండని, ఒక్క నిమిషం ఆగండని లోకేష్ పదే పదే విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.
లోకేష్ ప్రసంగంలో ఆసక్తికరం
లోకేష్ ప్రసంగంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కార్యకర్తలు పదేపదే ఈలలు వేశారు. దీంతో ఆయన దయచేసి వినాలని విజ్ఞప్తి చేశారు. ఓ సమయంలో మాట్లాడుతూ.. చంద్రబాబు కరెంట్ పోకుండా చేశారని, ఇప్పుడు సీరియల్ టెన్షన్ తప్ప (ఏమవుతుందోనని), పవర్ టెన్షన్ లేదన్నారు. మరో సందర్భంలో... భోజనానికి సమయం అయినట్లుందని, టైం అయిందని వ్యాఖ్యానించారు.
నేతలకు చంద్రబాబు క్లాస్
మహానాడులో చంద్రబాబు టిడిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు వేదికపైనే నేతలకు ఆయన చురకలంటించారు. టిడిపిలో సమస్య కార్యకర్తలతో లేదని, నాయకులతోనే అని మండిపడ్డారు. ముందు నాయకుల్లో క్రమశిక్షణ రావాలన్నారు.
మహానాడు వేదికపై నేతలు గ్రూప్ మీటింగ్లు పెడుతున్నారని, ఇది సరికాదని చంద్రబాబు టిడిపి నేతలను హెచ్చరించారు. చాలా ప్రాంతాల్లో నాయకులు వర్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారని, అలా చేసిన వారందరి జాబితా తన దగ్గర ఉందని చంద్రబాబు చెప్పారు.
ఆ పరిస్థితి తేవొద్దు
నాయకుల మధ్య వైరం ఉంటే కార్యకర్తలు ప్రత్యమ్నాయం చూసుకుంటారని, అలాంటి పరిస్థితి తీసుకురావద్దని చంద్రబాబు టిడిపి నేతలను ఆదేశించారు. నాయకులు ముందు చెప్పింది వినడం నేర్చుకోవాలని సూచించారు. అప్పట్లో తాము గంటల తరబడి కూర్చొని ప్రసంగాలను వినేవాళ్లమని, ఇప్పడు చాలామంది నాయకులకు ఆ పట్టుదల కొరవడుతోందన్నారు. ముందు విషయంపై అవగాహన పెంచుకోవాలన్నారు.