హోదా ముసుగులో మోడీ కాళ్లపై పడ్డారు: జగన్పై లోకేష్, ‘కేసుల మాఫీ-బీజేపీలోకి వైసీపీ’
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ముసుగులో జగన్మోహన్ రెడ్డి మరో నాటకం మొదలుపెట్టారని ధ్వజమెత్తారు.
కేసుల కోసం మోడీ కాళ్లపై
‘మోదీ కాళ్ల మీద పడుతూ, పిఎంఓ చుట్టూ తిరుగుతూ ప్రత్యేక హోదా ముసుగులో కేసుల మాఫీ కోసం జగన్ మరోసారి క్విడ్ ప్రో కో నాటకం మొదలుపెట్టాడు' అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి లోకేష్.
జగన్కు ఆ ధైర్యం లేదు
‘ఢిల్లీ పెద్దల మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించడానికి 5 కోట్ల తెలుగు ప్రజలు తమ రోషాన్ని చూపిస్తుంటే, మోదీని నిలదీసే దమ్ము, ధైర్యం లేని జగన్ ప్రజల్ని మోసం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు' అని లోకేష్ ధ్వజమెత్తారు.
బీజేపీలోకి వైసీపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పతనం ఏపీ నుంచే ప్రారంభమైందని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ... విజయసాయిరెడ్డిని కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీలో పెట్టారని, వైసీపీని బీజేపీలో కలిపేందుకు జగన్ సిద్ధమయ్యాడని ఆనందబాబు అన్నారు.
ఒప్పందం కుదిరింది
కేసుల మాఫీ కోసం జగన్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని, ఎన్నికల్లోగా రెండు మూడు కేసులు మాఫీ అయ్యే అవకాశం ఉందన్నారు.. ఇప్పటికే ఈడీ అటాచ్మెంట్లో ఉన్న 40 కోట్లకు పైగా ఆస్తులకు రిలీఫ్ ఇచ్చారన్నారు. అలాగే జగన్ తన పద్దతి మార్చుకోకుంటే ప్రజలు తరిమి తరిమి కొడతారన్నారు.
అక్కడ రాజధాని రాలేదనే..
పదవీ వ్యామోహంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో బంధువులతో భూములు కొనిపెట్టాడని, అక్కడ రాజధాని రాలేదని విషం కక్కుతున్నాడని మంత్రి ఆనంద్ బాబు ఆరోపించారు. అమరావతి రాజధాని అభివృద్ధి కాకుండా జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.