నంద్యాల మాదే: లోకేష్, ‘బాబు ప్రోత్సాహంతోనే శిల్పాపై కాల్పులు’
నంద్యాలలో తెలుగుదేశం పార్టీ వంద శాతం గెలుస్తుందని, భారీ మెజారిటీ వస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు.
విశాఖపట్నం: నంద్యాలలో తెలుగుదేశం పార్టీ వంద శాతం గెలుస్తుందని, భారీ మెజారిటీ వస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీని గెలిపిస్తాయని, కాకినాడలో కూడా ఇదో జరుగుతుందని లోకేశ్ అన్నారు.
మీరే చూస్తారు..
కొత్తగా నెలకొల్పిన ఐటి కంపెనీలను ప్రారంభించడానికి గురువారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. నంద్యాల ఎన్నికల గురించి విలేఖరులు ప్రస్తావించగా.. ‘మీరే చూస్తారుగా' అని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లంటికీ ఒకేసారి ఎన్నికలు జరుపుతామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
బాబు ప్రోత్సాహంతోనే శిల్పాపై కాల్పులు
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లనే ఫ్యాక్షన్ పెరుగుతోందని, రౌడీషీటర్లకు గన్మెన్లను కేటాయిస్తూ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నంద్యాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి లక్ష్యంగా దాడి జరిగిందన్నారు.
చంద్రబాబు ఏం చేస్తున్నారు?
దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తప్పు చేసిన వారు ప్రజలచే శిక్షించబడాలని ప్రతిపక్షనేత జగన్ మాట్లాడితే పెద్ద రాద్ధాంతం చేసిన చంద్రబాబు.. టిడిపి నేతలు హింసాత్మక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే..
నంద్యాల ఎన్నికల కోడ్ అమలులో ఉండగా గన్, బుల్లెట్లు ఎందుకు పోలీసు స్టేషన్లో డిపాజిట్ చేయలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా అని ప్రశ్నించారు. నంద్యాలతో సంబంధం లేని టిడిపి ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతుండగా పోలీసు అధికారులతో మంతనాల జరిపారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.