‘జగన్! పార్టీ మూసుకో-‘పీకే’ను పీకేశారు’: ‘నంద్యాల’పై లోకేష్ ఇలా
నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంపై ఏపీ మంత్రి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి: నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంపై ఏపీ మంత్రి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా లో వరుస ట్వీట్లు చేసి తన స్పందనను తెలియజేశారు.
'టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం నంద్యాల ఉపఎన్నిక ఫలితం. సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రజల నేత. అభివృద్ధిపై తమ నమ్మకాన్ని కనబర్చిన నంద్యాల ప్రజలకు కృతఙ్ఞతలు. అదేవిధంగా, వైసీపీ క్రిమినల్ పాలిటిక్స్కు నంద్యాల ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారు. ప్రతి టీడీపీ కార్యకర్తకు నా ధన్యవాదాలు' అని లోకేశ్ పేర్కొన్నారు.
Thank U #Nandyal for believing in development & giving a fitting reply to criminal politics of @YSRCParty. Thanks to every TDP Karyakarta.
— Lokesh Nara (@naralokesh) August 28, 2017
పీకేను పీకేశారు.. జగన్! పార్టీ మూసుకో: ఆదినారాయణ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. నంద్యాల నియోజకవర్గాన్నే కాకుండా, రాష్ట్రం మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే అభివృద్ధి చేయగలరనే నమ్మకంతోనే ఓటర్లు నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి పట్టం కట్టారని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు.
అన్ని రోజుల పాటు నంద్యాలలోనే మకాం వేసినప్పటికీ వైసీపీ అధినేత జగన్ను నంద్యాల ప్రజలు నమ్మలేదని చెప్పారు. ఈ ఎన్నికతో వైసీపీ పతనం ప్రారంభమైందని అన్నారు.
రానున్న రోజుల్లో వైసీపీ దుకాణాన్ని జగన్ మూసుకోవాల్సిందేనని ఆదినారాయణ రెడ్డి జోస్యం చెప్పారు. వైసీపీని నిలబెడతానంటూ వచ్చిన పీకే (ప్రశాంత్ కిషోర్)ను నంద్యాల ఓటర్లు పీకేశారని ఎద్దేవా చేశారు. పీకే ప్లాన్లు ఉప ఎన్నికలో వర్కౌట్ కాలేదని ఎద్దేవా చేశారు.