5వేల ఓట్లతోనే! అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే: లోకేష్
అమరావతి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రావడం అంత కష్టమేమీ కాదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై 1500 రోజుల సందర్భంగా గురువారం ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రారంభమైన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న లోకేష్ మాట్లాడారు.
లోపాలున్నాయి..
అనంతపురం, నంద్యాల, కడపలో బూత్ కమిటీల ఏర్పాటులో లోపాలున్నాయని త్వరలో తగు చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పారు. 13 పార్లమెంట్ స్థానాల్లో శిక్షణా కేంద్రాలు ప్రారంభించామని మంత్రి వెల్లడించారు.
బూత్ కమిటీల బోపేతంతో..
సాధికారమిత్రల తరహాలో సేవా మిత్రలు వేస్తున్నామన్నారు. బూత్ కమిటీలకు, సేవామిత్రలకు శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి బూత్ స్థాయిలో పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
అన్ని స్థానాలు కైవసం..
బూత్ లెవల్ కమిటీలు బలమైతే వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలనూ కైవసం చేసుకోవడం సులభమవుతుందన్నారు. పార్టీ తరఫున ప్రతి వంద మందికి ఒకరు చొప్పున సేవా మిత్రను నియమిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
5వేల ఓట్లతో గెలుపు..
ఐదు వేల ఓట్లతో గెలిచే అసెంబ్లీ సెగ్మెంట్లే ఎక్కువగా రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. ప్రతిబూత్ పరిధిలో అదనంగా 10 ఓట్లను ప్రభావితం చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాసమేనని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. కాగా, మంత్రి లోకేష్ ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ..పవన్ కళ్యాణ్, వైయస్ జగన్మోహన్ రెడ్డిలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తమ ప్రభుత్వం వేసిన రోడ్లపైనే పవన్, జగన్లు తిరుగుతున్నారంటూ పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అభివృద్ధి పుత్రుడైతే.. జగన్ అవినీతి పుత్రుడని, పవన్.. మోడీ దత్తపుత్రుడని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.