జగన్ ట్రేడ్ మార్క్ ట్రిక్: లోకేష్, 'బాబూ! శివాజీ అల్లకల్లోలంపై ఆధారాలపై విచారణ ఏది'
న్యూఢిల్లీ/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ పైన దాడి చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తేనని వైసీపీ నేతలు ఢిల్లీలో మాట్లాడటంపై మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ట్రేడ్ మార్క్ మార్ఫింగ్ ట్రిక్ మరోసారి బహిర్గతమైందని ఎద్దేవా చేశారు.
చదవండి: పవన్ కళ్యాణ్! మరిచిపోయావ్.. ఇలా చేయి, నా మద్దతు కేసీఆర్కే: నటుడు సుమన్
ఒప్పుకునే ధైర్యం లేని వ్యక్తి జగన్
దాడి చేసింది తన అభిమానే అనే ఒప్పుకునే ధైర్యం లేని నాయకుడు జగన్ అని చెప్పారు. తన అభిమానిని టీడీపీ కార్యకర్తగా చెబుతూ చీఫ్ఫోటోషాప్ గిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి జగన్ తప్ప మరో వ్యక్తి ఉండరని చెప్పారు
జగన్ కుడివైపు తిరగకుంటే చనిపోయేవాడని పోలీసుల రిపోర్ట్
అంతకుముందు, వైసీపీ నేత వరప్రసాద్ ఢిల్లీలో మాట్లాడారు. పరిస్థితి చూస్తుంటే ఇది హత్యాప్రయత్నమని, జగన్ కుడివైపుకు తిరగకుంటే చనిపోయేవాడని కూడా పోలీసుల రిమాండ్ రిపోర్టులో తేలిందని తిరుపతి మాజీ ఎంపీ, వైసీపీ నేత వరప్రసాద అన్నారు. తమకు న్యాయవిచారణ జరగాలని, అన్ని విషయాలు బయటకు రావాలన్నారు.
అసలు అతనిని ఉద్యోగంలో ఎలా పెట్టుకున్నారు
ప్రజా సంకల్ప యాత్రలో జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నందున జగన్ సీఎం కాకుండా చేసే ఉద్దేశ్యంతో చంద్రబాబు చేశారని వరప్రసాద్ అన్నారు. ఈ దాడి వెనుక చంద్రబాబు లేకుంటే దానిని ఖండించవలసి ఉండెనని చెప్పారు. టీడీపీ వ్యక్తి అతనికి విమానాశ్రయంలోకి ఎంట్రీ పాస్ ఇప్పించి, ఉద్యోగంలో ఎలా పెట్టుకున్నాడో చెప్పాలని ప్రశ్నించారు.
శివాజీ అల్లకల్లోలంపై విచారణ ఏది.. ఈ ప్రశ్నలకు జవాబేది
ఓ కుర్రాడు పబ్లిసిటీ కోసం చేశాడని టీడీపీ నేతలు చెప్పారని, ఇప్పుడు తేలుకుట్టిన దొంగల్లా పక్కకు తప్పుకున్నారని మరో వైసీపీ నేత ఉమ్మారెడ్డి అన్నారు. ఆపరేషన్ గరుడ గురించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, మరి దానిపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. హీరో శివాజీ దేని ఆధారంగా ఈ వివరాలు ఇస్తున్నాడో చంద్రబాబు ప్రభుత్వం విచారణ చేయవద్దా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని, రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని, శివాజీ చెప్పాకు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. నాడు విశాఖలో జగన్ను ఎందుకు అడ్డుకున్నారన్నారు.