జగన్ గారికి ఈ అలవాటు ఇంకా పోలేదన్న నారా లోకేష్ .. ఏం విషయంలోనో చెప్పారుగా !!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజా పరిణామాల నేపధ్యంలో ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తనదైన స్టైల్ లో విమర్శలు చేశారు. ఏపీలో విపరీతంగా విద్యుత్ చార్జీలు పెంచిన నేపధ్యంలో టీడీపీ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ క్రమంలో సీఎం జగన్ కు ఆ అలవాటు ఇంకా పోలేదని వ్యాఖ్యానించారు నారా లోకేష్ . ఇంతకీ నారా లోకేష్ జగన్ విషయంలో చెప్పిన ఆ అలవాటు ఏంటి అంటే ....
డబ్బు కోసం ప్రజలను పీడించుకు తినే అలవాటు ఏపీ సీఎం జగన్ కు అధికారంలోకి వచ్చాక కూడా పోలేదని నారా లోకేష్ విమర్శలు చేశారు . విద్యుత్ చార్జీలు పెంచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలు అసలే లాక్ డౌన్ కష్టాల్లో ఉంటె ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచి డబ్బు కోసం ప్రజలను పీడిస్తున్నారని నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రజలు లాక్డౌన్ నేపధ్యంలో పనుల్లేక పుట్టెడు కష్టాల్లో ఉన్నా పట్టించుకోకుండా గుట్టుగా కరెంటు ఛార్జీలు పెంచి డబ్బు గుంజుతున్నారని ట్విటర్ వేదికగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఇక అంతేకాదు ప్రజలను ఆదుకోవాలని ఆయన జగన్ కు సూచించారు . పాలన అంటే ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించాలి కానీ, కష్టాల్లోకి నెట్టడానికి కాదని జగన్ గ్రహించాలని హితవు పలికారు. ఇక పార్టీ రంగులేయడానికి మీరు చేసిన వృథా ఖర్చు కన్నా 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దుచేస్తే వచ్చే నష్టం ఏమీలేదని జగన్ ప్రభుత్వంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాబట్టి ఆ పని చేసి ప్రజలను ఆదుకోండి అంటూ నారా లోకేష్ మూడు నెలల విద్యుత్ చార్జీలను రద్దు చెయ్యాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు చేస్తున్న నిరసనలకు ప్రజలు మద్దతు తెలపాలని కూడా లోకేష్ తన ట్వీట్ ద్వారా కోరారు.