మహానాడును రద్దు చేసి..ఎన్టీఆర్ జయంతి వేడుకలు!
Recommended Video
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంత్యుత్సవాలను గుంటూరు జిల్లా నాయకులు ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఎన్టీ రామారావు విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యల హాజరైన జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
సామాన్యుడిగా చరిత్రను తిరగరాసిన అసామాన్యడని అన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించడానికి ఆయనే ప్రధాన కారకులని చెప్పారు. వెనుకబడిన వర్గాలను రాజకీయాల్లోకి తీసుకొన్ని ఘనత ఎన్టీఆర్దేనని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. తెలుగువారి జీవనగతినే మార్చేశారని చెప్పారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు చేరువ కావాలని సూచించారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు క్రమశిక్షణతో పనిచేస్తూ, నిరంతరం ప్రజలకు అండగా ఉండాలని కార్యకర్తలకు అభిమానులకు సూచించారు.
నిజానికి- ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఏటా మూడు రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మూడు, నాలుగు సందర్భాల్లో తప్ప పార్టీ పుట్టినప్పటి నుంచి ఏటేటా క్రమం తప్పకుండా మహానాడును నిర్వహించారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా మహానాడును మాత్రం నిర్వహించే వారు. ఈ సారి క్రమం తప్పింది.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా పరాజయం పాలవుతుందని ముందే గ్రహించడం వల్లో, ఏమో గానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేడుకలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోసారి నిర్వహిద్దామని పార్టీ ముఖ్యులకు సూచించారు. ఎన్టీ రామారావు జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించుకున్నారు. ఊహించిన దానికంటే దారుణంగా పార్టీ ఓటమి పాలు కావడంతో ఈ ఏడాది మహానాడు లేనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.