హెచ్సీఎల్ కంపెనీ ఎపికి రావడానికి...మంత్రి లోకేష్ ఎంతో కృషి చేశారు:వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్
విజయవాడ:కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీ హెచ్సిఎల్ క్యాంపస్ ఫేజ్-1కు రాష్ట్ర ఐటిశాఖ మంత్రి లోకేష్ సోమవారం సాయంత్రం భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమానికి హెచ్సిఎల్ సీఈవో రోషిణి నాడార్, మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్సీఎల్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ ఏపీకి రావడానికి మంత్రి లోకేష్ ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా హెచ్సీఎల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని హెచ్సీఎల్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ తెలిపారు.
హెచ్ సిఎల్ కంపెనీ కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో 28 ఎకరాల్లో రూ.750 కోట్ల వ్యయంతో రెండు క్యాంపస్ లను నిర్మించనుంది. వీటి ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని సంస్థ ప్రతినిథులు తెలిపారు. నాలుగేళ్లలో క్యాంపస్ పనులు ప్రారంభం అవుతాయన్నారు. రాష్ట్రంలో ఐటీ నాలెడ్జ్ ఉన్న యువత ఏపీలో పుష్కలంగా ఉన్నారని అన్నారు. హైదరాబాద్, బెంగళూరు తర్వాత.. ఐటీకి అవకాశం ఉన్న ప్రాంతం అమరావతి అని చెప్పారు.
హెచ్ సిఎల్ ఈ ప్రాజెక్ట్ కోసం రెండు దశల్లో రూ. 750 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా మొదటి దశలో రూ.400 కోట్ల పెట్టుబడి పెడుతుందని, 4వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని చెబుతున్నారు. మొదటి దశలోనే ఐటీ రంగంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ప్రారంభించనున్నారు.
హెచ్సీఎల్తో ఒప్పందం చేసుకున్న 45 రోజుల్లోనే అన్ని అనుమతులతో భూమి పత్రాలను సంస్థకు అందజేయడం ద్వారా మంత్రి లోకేష్ ఈ కంపెనీ ఎపికి రావడానికి కీలక పాత్ర పోషించినట్లు సంస్థ ప్రతినిథులు కొనియాడారు. ఐటీ రంగంలో 2019నాటికి లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా హెచ్సీఎల్ పెట్టుకోగా...ఇప్పటికే ఐటీ రంగంలో 36వేల ఉద్యోగాలను ఆ సంస్థ కల్పిస్తోందని తెలుస్తోంది.