టీడీపీకి అస్త్రాలుగా సీఎం జగన్ భజన బృందం మాటలు ... వీడియో పోస్ట్ చేసి కామెడీ బయటపెట్టిన నారా లోకేష్
గత ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన నాటినుండి టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వంపై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఇక తాజాగా స్టిక్కర్ ముఖ్యమంత్రి గారి భజన బృందం వారి మాటలు నిజంగా పెద్ద కామెడీ అంటూ నారా లోకేష్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఇక ఈ పోస్టులో నారా లోకేష్ అసెంబ్లీలో, వైసీపీ ఎమ్మెల్యేలు అవాక్కయ్యేలా మాట్లాడిన తీరును వీడియోలో షేర్ చేశారు.
గాజువాక నియోజకవర్గానికి 186 కోట్లు ఇస్తే ఒక్క వార్దుకే 1250 కోట్లు అంటూ గాజువాక ఎమ్మెల్యే కామెడీ
ఇక ఈ వీడియోలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గాజువాక నియోజకవర్గానికి 186 కోట్లు ఇచ్చాడని చెప్పడం, పైప్ లైన్ ద్వారా నీరు అందించేందుకు ఆయన ప్రయత్నం చేశారని, అందులో అప్పుడు కార్పొరేటర్ గా తాను ఉన్న వార్డుకు కూడా 1250 కోట్లు మంజూరు చేశారని చెప్పాడు. నియోజక వర్గానికి 186 కోట్లు ఇస్తే ఒక్క వార్దుకే 1250 కోట్లు ఎలా ఇస్తారో .. అర్థం పర్థం లేని గాజువాక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు విని ఏపీ అసెంబ్లీ లో ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఒక వార్డుకు 1250 కోట్లు కేటాయించటం ఏంటి అంటూ నోరెళ్లబెట్టారు. ఇక ఇది కామెడీని పండించింది అంటూ నారా లోకేష్ వీడియో ట్వీట్ చేశారు.
Recommended Video
టీసీఎల్ లో 10 వేల మందికి జాబ్స్ ఇవ్వటానికి జగనన్న పర్మీషన్ ఇచ్చారట .. అంతేనా అమెరికాను కనుగొంది వాస్కోడిగామానట
ఇక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ టీసీఎల్ లో 10 వేల మందికి జాబ్లు ఇస్తానని, జగన్ అన్న పర్మీషన్ కూడా ఇచ్చారని చెప్పారని సభలో భజన చేసిన విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు నారా లోకేష్. టి సి ఎల్ కంపెనీ భూమి పూజ చంద్రబాబు హయాంలో జరిగింది అనే విషయం ఓ టీవీ ఛానల్లో ప్రసారమైన వార్త ద్వారా తెలియజేసి, జగన్ బృందం చేస్తున్న భజన ను వీడియో సాక్ష్యం గా బయట పెట్టారు. ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు గురించి ప్రజలు జగన్ని ప్రశ్నిస్తుంటే అతని వైసిపి ప్రభుత్వం, వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్ భజన చేస్తున్నారని చూపించాడు. అలాగే అమెరికాను కనిపెట్టింది వాస్కోడామా అని చెప్పబోయిన మధుసూదన్ రెడ్డికి పక్కనున్న వైసీపీ ఎమ్మెల్యేలు వాస్కోడిగామా అని పక్క నుండి అందించారు . . అమెరికాను కనిపెట్టింది వాస్కోడామ్, వాస్కోడిగామా కాదు కొలంబస్ అన్న విషయం కూడా వారికి తెలీదని ఆయన వీడియో షేర్ చేసి స్టిక్కర్ ముఖ్యమంత్రి గారు ఆయన భజన బృందం చెప్పే మాటలు నిజంగా పెద్ద కామెడీ అంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.
ఇక దేవుళ్ళందరూ జగన్ లోనే కనిపిస్తున్నారని జగన్ బృందం భజన ...
అంతే కాదు మొన్నటికి మొన్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం జగన్ దేవుడని,అందరికీ బ్రహ్మ తలరాతను రాస్తాడు అని, తనకు మాత్రం జగన్ తలరాత రాసాడని చెప్పారు. అందుకే మంత్రిని అయ్యానని జగనే తనకు బ్రహ్మ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వాల్మీకి బోయ తెగకు చెందిన వాడినని, తనకు జగనన్న వాల్మీకి అని ప్రశంసల వర్షం కురిపించారు. నామినేటెడ్ పదవులు పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు అంబేద్కర్, ముస్లింలకు అల్లా, క్రిస్టియన్లకు జీసస్ అంటూ ఆకాశానికెత్తేశారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ఎన్నో కష్టాలు పడ్డాడు అని, తప్పు చేయకున్నా ఎన్నో బాధలు అనుభవించారని, ఇక జగన్ అనుభవించిన బాధలు శత్రువుకు కూడా రాకూడదంటూ జగన్ గొప్పతనాన్ని సభా వేదికగా తెలియజేశారు.
టీడీపీకి అస్త్రాలుగా జగన్ భజన బృందం మాటలు .. సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నారా లోకేష్
వాస్తవాలను పక్కనపెట్టి, జగన్ ను ఆహా ఓహో అని పొగడటం... ఎప్పుడో జరిగిన అభివృద్ధిని కూడా తాము సాధించిన ప్రగతి గా చూపించుకోవడం, అసలు సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఎవరికి తోచిన విధంగా వారు అసెంబ్లీ లో మాట్లాడటం... జగన్ దగ్గర మెప్పు పొందడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలు ఏమనుకుంటారో అన్న భావన కూడా లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశం కాగా , టిడిపికి ప్రస్తుతం అవి ఆయుధాలుగా దొరికాయి.. ఇది ఎక్కడ భజన రా బాబు అని టిడిపి నేతలు ప్రశ్నించేలా చేస్తున్నాయి.