లోకేష్ వ్యాఖ్యలు చిచ్చురేపాయా?: ఓ వర్గంలో ఆనందం, మరో వర్గంలో..
ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు శృంగవరపుకోట రాజకీయాల్లో కలకలం రేపాయి. మంగళవారం ఎస్ కోటలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర చర్చకు.
విజయనగరం: ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు శృంగవరపుకోట రాజకీయాల్లో కలకలం రేపాయి. మంగళవారం ఎస్ కోటలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర చర్చకు దారితీశాయి.
లోకేష్ ప్రసంశలు
సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీటు అంటూ మంత్రి వ్యాఖ్యానించడంపై పార్టీ శ్రేణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే లలిత కుమారి పనితీరుపై మంత్రి లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు.
సీటు ఆమెకే..
అంతేగాక, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మరోమారు లలితాకుమారిని గెలిపించాలని ప్రజలకు కోరారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీటు అని లోకేష్ స్పష్టం చేయడంతో టీడీపీలో మరో వర్గం కొంత అసంతృప్తికి గురైంది.
సిట్టింగ్, మాజీల మధ్య వార్..
నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే హైమావతిల మధ్య గత కొంత కాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐదు మండలాల్లోనూ టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మద్దతుదారులుగా విడిపోయినట్లు తెలుస్తోంది.
ఒక వర్గంలో ఆనందం.. మరో వర్గంలో..
జామి, ఎస్ కోట మండలాధ్యక్షుల మార్పులో నెలకొన్న స్తబ్ధత ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇలాంటి పలు సమస్యలు పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తుండగా.. లోకేష్ తాజా వ్యాఖ్యలు ఒక వర్గంలో ఆనందం నింపగా, మరో వర్గానికి నిరాశ కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైమావతి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక తనదారి తాను చూసుకుంటారా? అనే చర్చ సాగుతోంది.