జనంలోకి లోకేష్...రాష్ట్ర పర్యటనకు సమాయత్తం
Recommended Video
అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారా?...అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికలు అంతకంతకూ సమీపిస్తున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించగా, లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి శ్రేణులను సమాయత్తం చేస్తారని తెలిసింది. జిల్లాల వారీగా పర్యటన జరుపుతూ అన్ని విభాగాల్లో పార్టీని బలోపేతం చేసేలా లోకేష్ ప్రణాళిక రూపొందించుకున్నారని తెలిసింది.
ముందస్తు ఎన్నికలకు నో...నో అంటూనే ఎందుకైనా మంచిదని టిడిపి అప్పుడే సన్నాహక చర్యలు ఆరంభించిందా?...అంటే అవుననే అనుకోవచ్చు. కారణం టిడిపి అమలు చేయనున్న ప్రణాళికలే. గత కొంతకాలంగా పార్టీలో అన్నీ తానై ముందుకు నడిపిస్తున్న యువ నేత నారా లోకేష్ అతి త్వరలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు సంసిద్దమవుతున్నారట.
జిల్లాల వారీగా వారంలో మూడు రోజులు అధికారిక కార్యక్రమాలు...మరో మూడు రోజులు పర్యటనలు చేయాలని లోకేష్ భావిస్తున్నారట. ఈ పర్యటనల ద్వారా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు వారి సమస్యలకు పరిష్కారం చూపనున్నారట. రాష్ట్ర పర్యటన ద్వారా జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్లను సరిదిద్దనున్నారు. రానున్న రెండు మూడు నెలల్లో తొలి విడత పర్యటన పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. ధర్మపోరాట సభలను సైతం ఇకపై నెలకు ఒకటి లేదా రెండు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.