సాక్షిపై దుమ్మెత్తిపోశారు: ఆరోజు అసలేం జరిగింది?, జగన్కు లోకేష్ బహిరంగ లేఖ
అమరావతి: డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను అవమానించారంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనాలకు గాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం వైసీపీ అధినేత వైయస్ జగన్కు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన సాక్షి పత్రికపై ధ్వజమెత్తారు.
Here is the proof to set the record straight for our opposition. My humble request, please stop petty politics. https://t.co/ngXi0YEdhn
— Lokesh Nara (@naralokesh) October 8, 2016
సాక్షి పత్రికలో అసత్యాలు, అభూత కల్పనలు రాస్తారన్నది మరోసారి స్పష్టమైందని ఆరోపించారు. శుక్రవారం సాక్షి పత్రికలో ప్రచురించిన కథనాలతో ఈ విషయం రుజువైందని ఆయన పేర్కొన్నారు. ఇది పత్రిక, రాజకీయ విలువలను దిగజార్చడం కాదా అని ప్రశ్నించారు.
అబద్ధాలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జగన్ మీడియా చేసిందని, దీనికి ప్రజల ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ శిక్షణ తరగతుల్లో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను లోకేశ్ విడుదల చేశారు.
చినరాజప్పతో తనకు అభిమానపూర్వక సంబంధాలే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. పెద్దలు, సహచరులను గౌరవించడం తన తల్లిదండ్రులు నేర్పారని, తమలా తండ్రి, తల్లి, చెల్లి, చిన్నాన్నను అవమానపర్చలేదని లోకేశ్ ఎద్దేవా చేశారు. వారి వ్యవహార శైలి వల్లే చాలా మంది నాయకులు పార్టీని వీడిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో వైయస్తో పని చేసిన మంత్రులు, సహచరులపై సాక్షిలో తప్పుడు కధనాలు ప్రచురించిన ఘనత జగన్దని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ శిక్షణ తరగతుల్లో భాగంగా తాను ప్రజంటేషన్ ఇస్తుండగా డిప్యూటీ సీఎం చినరాజప్ప వివరణ ఇస్తూ ఒక అభిప్రాయం చెప్పారే తప్ప అక్కడ ఏమీ జరగలేదన్నారు.
"బీజేపీ సమావేశాల్లో పార్టీ నాయకులు వేదిక మీద ఉంటే కేంద్ర మంత్రులు కూడా సభలో కూర్చుంటున్నారు. ఏ పార్టీలోనైనా ఇదే జరుగుతుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను పార్టీ వేదికలలో ప్రజంటేషన్ ఇవ్వడానికి వేదిక మీద ఉంటే మంత్రులు సభలో కూర్చోవడం సహజం. దీనిపైన కూడా నిందలు వేసి ప్రచారం చేయడం మీ అసూయ, విద్వేష స్వభావానికి నిదర్శనంగా నిలుస్తోంది." అని లేఖలో పేర్కొన్నారు.
"రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నానంటూ నాపై నిందలు వేస్తే మీ పాపాలు తొలగిపోతాయా?" అని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, హాం మంత్రి చినరాజప్పపై లోకేష్ ఫైర్ అయ్యాడంటూ శుక్రవారం సాక్షిలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొన్ని ఫోటోలను కూడా సాక్షి వెలువరించింది.